![Road Accident](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-9-22.jpg)
Road Accident : హైదరాబాద్ ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రెండు కార్లను ఓ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి దాటాక ఈ ప్రమాదం జరిగింది.
హైదరాబాద్ కు చెందిన ఓ కుటుంబం వీకెండ్ కావడంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులోని ఓ ఫుడ్ కోర్టుకు వెళ్లారు. రాత్రి అక్కడి భోజనం చేసిన కుటుంబ సభ్యులు రెండు కార్లలో తిరుగు ప్రయాణమయ్యారు. అందులో మనీషా అనే అమ్మాయికి జర్నీ పడకపోవడంతో వికారంగా అనిపించింది. దీంతో పోలీస్ అకాడమీ వద్ద కార్లు రోడ్డు పక్కన ఆపగా.. ఆమె వాంతులు చేసుకుంది. అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ట్యాంకర్ ఒక్కసారిగా వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో మనీషాతో పాటు తరుణ్ అనే యువకుడు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం ధాటికి వారి శరీరాలు నుజ్జునుజ్జయ్యాయి. మరికొందరికి తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆసుపత్రికి తరలించారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తున్నారు.ప్రమాద సమయంలో ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రోడ్డు పక్కన కార్లు సురక్షితంగా పార్కింగ్ చేసినప్పటికీ ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఘోర ప్రమాదం జరిగిందని చెప్పారు.