Telangana MP Elections Results : లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ జోరుగా సాగుతోంది. కేంద్రంలో ఎన్డీయే 290కి పైగా సీట్ల మెజారిటీతో దూసుకుపోతోంది. అయితే 220 సీట్లను ఇండీ కూటమి కూడా అందుకోగలిగింది. తెలంగాణలో ముగ్గురు నేతలు, వారి ప్రధాన మద్దతుదారులు చాలా నిశితంగా పలితాలను పరిశీలిస్తున్నారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవదని, సున్నాకు పరిమితమవుతుందని, అదృష్టవంతులైతే ఒక్క సీటు దక్కవచ్చని చెప్పాయి.
అయితే తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ లేదంటే బీజేపీ రెండంకెల స్థానాలు సాధిస్తాయా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఏ పార్టీ రెండంకెల సీట్లు సాధిస్తే ఆ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా నిలిచే ఛాన్స్ ఉంది. ఐదు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ లోక్ సభ ఎన్నికలు కీలక రణరంగంగా కనిపిస్తున్నాయి.
బీఆర్ఎస్ జీరోకు పరిమితమైనా, లేదంటే ఒక్క సీటు వచ్చినా మనుగడ సంక్షోభంలో పడ్డట్లేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ రెండంకెల స్కోరుకు చేరితే అది కేసీఆర్, బీఆర్ఎస్ నేతల మనోస్థైర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందన్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు బీజేపీకి గేమ్ ఛేంజర్ అని, మునుపెన్నడూ లేని విధంగా తెలంగాణలో పొలిటికల్ గేమ్ ను చూడబోతున్నాయని విశ్లేషకులు చెప్తుండగా.. బీఆర్ఎస్ కు మాత్రం అత్యంత దయనీయమైన ఎన్నికలుగా చెప్తున్నారు.
పదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ సొంత రాష్ట్రంపై ఇంతగా పట్టుకోల్పోతుందని ఎవరూ ఊహించలేదని, లోక్ సభలో ఎంఐఎం కంటే దిగజారిపోయిందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ ఫలితాల్లో రెండెంకల స్కోర్ ఏ పార్టీకి రాకపోవచ్చని తెలుస్తోంది. సాయంత్రం వరకు ఆగితే తప్ప ఒక కొలిక్కి వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది.