Jaiswaraajya TV Poll : ఏపీలో కాంగ్రెస్ పార్టీ తన పట్టు పెంచుకోవాలని తహతహలాడుతోంది. మొన్ననే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత తన దృష్టిని ఏపీపై సారించింది. గతంలో వైఎస్ హయాం నాటి వైభవం, తెలంగాణ ఇచ్చిన తర్వాత పార్టీ పూర్తిగా తుడుచుకుపెట్టుకపోయిన విషయాలు అందరికీ గుర్తే ఉన్నాయి. తాజాగా కేంద్రంలో ఉన్న బీజేపీని ఢీకొట్టడానికి కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా తనకు మొదటి నుంచి పట్టున్న దక్షిణాదిలో మరింతగా పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది. కర్నాటక, తెలంగాణలో సొంత ప్రభుత్వాలు, కేరళ, తమిళనాడుల్లో కాంగ్రెస్ మిత్రపక్షాలు అధికారంలో ఉన్నాయి. ఇక కీలక రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా సత్తా చాటాలని భావిస్తోంది.
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన బలంగా ఉన్నాయి. ఈ మూడు పార్టీలు వ్యక్తిగత ఇమేజ్ తో అధికారంలోకి వస్తున్న పార్టీలే. ఈ పార్టీలను ఢీకొట్టి కాంగ్రెస్ ను నిలబెట్టే వ్యక్తి కోసం ఆ పార్టీ ఎదురుచూసింది. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ఆ పార్టీకి ఆశాదీపంలాగా కనపడింది. వైఎస్ తనయురాలిగా, డైనమిక్ యంగ్ లీడర్ గా, అలాగే అంగ, ధన బలం ఉన్న నాయకురాలిగా ఆమే వారికి ఫస్ట్ చాయిస్ అయ్యింది. ఇక సీఎం జగన్ ను షర్మిలతో ఢీకొట్టవచ్చే వ్యూహాన్ని కాంగ్రెస్ రచించింది. ఈమేరకు ఆమె నిన్న కాంగ్రెస్ లో చేరడంతో మరో రెండు రోజుల్లో షర్మిలకు ఏ బాధ్యతలు ఇస్తారో స్పష్టత కూడా రానుంది.
ఈక్రమంలో ఏపీ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీతో ఎవరికీ నష్టం అనే యాంగిల్ లో మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘‘షర్మిల ఏపీ కాంగ్రెస్ లో చేరి.. జగన్ ను ‘ఢీ’ కొట్టాలని మీరు భావిస్తున్నారా?’’ అనే ప్రశ్న ను ప్రముఖ మీడియా సంస్థ జైస్వరాజ్య టీవీ ఒపినియన్ పోల్ పెట్టింది. ఈ పోల్ లో విపరీత స్పందన లభించింది. ఈ పోల్ లో 1,61,000ల మంది తమ అభిప్రాయాన్ని తెలియజేయడం విశేషం. ఇందులో మెజార్టీ ప్రజలు ఏం చెప్పారనేది షాకింగ్ గా ఉంది. ఇంతకీ ప్రజల ఒపినియన్ ఎలా ఉందో చూద్దాం..
షర్మిల జగన్ ను ఢీకొట్టాలని 71శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారు. ఢీకొట్ట వద్దు అని 19శాతం మంది, చెప్పలేం అని 10శాతం మంది జనాలు తమ అభిప్రాయాన్ని చెప్పారు. దీన్ని బట్టే ఏపీలో ప్రజల మూడ్ ఎలా ఉందో తెలుస్తుంది. జగన్ ప్రభుత్వంపై ఏపీ ప్రజల్లో వ్యతిరేకత ఎంతగా పెరిగిందో స్పష్టంగా అర్థమవుతోంది. ఈ పోల్ లో శాంపిల్ కూడా పెద్ద మొత్తంలోనే ఉంది..అలాగే రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా యూత్ ఈ పోల్ లో పాల్గొన్నారు కాబట్టి.. ఈ పోల్ ను బట్టి రేపటి ఎన్నికల్లో పరిస్థితి ఎలా ఉంటుందో కొంచెం అటుఇటుగానైనా అంచనా వేయవచ్చు.
వైఎస్ జగన్ పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందన్నది నిజం. ఇంతలో కాంగ్రెస్ పార్టీలోకి ఆయన సొంత చెల్లి వెళ్లడం.. ఎటూ చూసినా వైసీపీకే నష్టం చేకూరే అంశమే. ఇప్పటికే వైసీపీ అసంతృప్తులంతా ఆ పార్టీ నుంచి జంప్ కావడానికే చూస్తున్నారు. అయితే వారికి టీడీపీ-జనసేన నుంచి సీటు వచ్చే అవకాశాలే లేవు. ఇక వారికి మిగిలింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. షర్మిల చేరికతో వారంతా ఆ పార్టీ సింబల్ పై పోటీ చేయడానికి సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే.. షర్మిల వెంట నడవడానికి ఫిక్స్ అయ్యారు. మరికొందరు అదే దారిలో ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన షర్మిల.. అన్నపై ప్రేమాభిమానాలు కురిపించే అవకాశాలు లేవు. ఎందుకంటే ఇద్దరి పార్టీలు వేరు. ఇద్దరూ రాజకీయంగా శత్రువులే. రాజకీయ పోరులో అన్నను తీవ్రంగా విమర్శించాల్సి రావొచ్చు. అన్నా చెల్లి పోరు చివరకు ప్రధాన ప్రతిపక్షమైనా టీడీపీ కూటమికి లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయి. షర్మిల తన అన్నను ఎంతగా ఢీకొడితే..టీడీపీకి అంతగా ప్లస్ అవుతుంది. ఇదే ప్రజల ఒపినియన్ పోల్ లో తేలింది. అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసీపీకే లబ్ధి జరుగవచ్చు కదా అని కొందరు అభిప్రాయపడొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు సీట్లు గెలిచే అవకాశాలు లేవు. గతంలో 1శాతం ఉన్న ఓటు బ్యాంకు 5శాతం దాక పెరిగితే గొప్పే. ఆ ఓటు బ్యాంకు కూడా వైసీపీ నుంచే కాంగ్రెస్ కు వస్తుంది తప్పా.. టీడీపీ-జనసేన నుంచి అసలే పోదు. కూటమి ఓట్ల శాతం వైసీపీ కన్నా చాలా ఎక్కువగా ఉండే అవకాశమే ఉంది. షర్మిల వల్ల జగన్ కే నష్టం కానీ, టీడీపీకి లాభమేనని స్పష్టంగా చెప్పవచ్చు. అన్నా, చెల్లి పోరుతో జగన్ కుటుంబపరంగా, నైతికంగా సతమతం కావొచ్చు. ఇవన్నీ కూడా టీడీపీ కూటమి విజేతగా నిలువడానికి సహకరిస్తాయి.