![Road Accident](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-9-2.jpg)
Road Accident in Gadwala : తెలుగు రాష్ట్రాల్లోని గత కొన్ని రోజులుగా రహదారులు రక్తమోడుతున్నాయి. వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎర్రవెల్లి చౌరస్తా సమీపంలో కారు, లారీ ఢీకొన్న ఘటనలో నలుగురు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడగా, వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. స్థానికులు తెలిపిన ప్రకారం..
ఏపీలోని కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డకు చెందిన ఓ కుటుంబం స్కార్పియో వాహనంలో శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ బయల్దేరింది. ఎర్రవెల్లి చౌరస్తా వద్దకు రాగానే ముందుగా వెళ్తున్న లారీని కారు బలంగా ఢీకొంది. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్, ఓ ముగ్గురు మహిళలు, ఇద్దరు బాలికలు, ఇద్దరు బాలురు ఉన్నారు. వారిలో డ్రైవర్ సహా ఇద్దరు మహిళలు, ఓ బాలుడు స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అపస్మారక స్థితిలో ఉన్న నలుగురిని పోలీసుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గద్వాల ప్రభుత్వాసుపత్రిలో వారికి చికిత్స అందుతోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే మృతులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.