![Sri Subrahmanya](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/06/23e1053e-e172-4ed6-9a33-70be8af19fa2.jpg)
Sri Subrahmanya : సేవా కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ముందే ఉంటారు యూబ్లడ్ యాప్ ఫౌండర్, జై స్వరాజ్య టీవీ అధినేత డా. జై యలిమంచిలి. అమెరికాలోని న్యూ జెర్సీలో సాయి దత్త పీఠం మరియు శ్రీ శివ విష్ణువు టెంపుల్ (SSPSSV) ఆధ్వర్యంలో ఆరుపాడై వీడు విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాల్లో పూజలు, తదితర కార్యక్రమాలు వైభవంగా కొనసాగుతున్నాయి. విజయవాడ దుర్గా ఆలయం ప్రధాన అర్చకుడు బ్రహ్మశ్రీ శంకర శాండిల్య శర్మ చేతుల మీదుగా పూజాదికాలను వేద పండితులు నిర్వహిస్తున్నారు.
ఈ వేడుకలకు సంబంధించి సుబ్రహ్మణ్య విగ్రహాన్ని జై-లావణ్య దంపతులు అందజేశారు. ఇంకా కార్యక్రమానికి కావాల్సిన ఖర్చులో ఎంతో కొంత వారు విరాళంగా అందజేయడంతో పాటు పూజలు చేయించడం, పూజాది కార్యక్రమాలను దగ్గరుండి చూసుకుంటున్నారు. జై దంపతులకు భక్తిభావాలు ఎక్కువని శంకర శాండిల్య శర్మ ఆశీర్వదించారు. ఆయనకు సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు ఉంటాయని చెప్పారు. విగ్రహాలను చెన్నై నుంచి తెప్పించడంలో, ప్రతిష్ఠాపన వేడుకలు నిర్వహించడంలో జై పాత్ర మరువమని చెప్పారు.
జూన్ 12న మొదలైన ఉత్సవాలు జూన్ 16 వరకు కొనసాగుతాయి. ఇందులో 12, 13 రోజుల్లో గణపతి పూజల నుంచి 13వ తేదీ ప్రసాద వితరణ వరకు వైభవంగా దేదీప్యమానంగా పూజలు కొనసాగాయి. అయితే 14న ఉదయం గణపతి పూజ, మండప దేవతా పూజలు, జలాధివాసం (సాయంత్రం), అగ్ని ప్రతిష్ఠాపన. మూలమంత్ర హోమాలు, క్షీరాధివాసం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఇక 15వ తేదీ (గురువారం) గణపతి పూజతో పాటు మరిన్ని కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
ఇక చివరి రోజు 16వ తేదీ (శుక్రవారం) మళ్లీ ఉదయం గణపతి పూజతో పూజాది కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 7 గంటలకు మిథున లగ్న సుముహూర్తమున యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, మహా పూర్ణాహుతి, నీరాజనం, మంత్ర పుష్పం, ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉండనున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారి ఆశీస్సులు అందుకోవాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇతర వివరాలకు 733-622-3250,51,52లో సంప్రదించాలని సూచించారు.