Pawan Kalyan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లిన ప్రజల మనసును గెలుచుకుంటున్నారు. తాజాగా, కాకినాడ జిల్లాలో మూడో రోజు పర్యటనలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఉప్పాడ వద్ద కోతకు గురవుతున్న తీరాన్ని పరిశీలించేందుకు వెళుతున్న కాన్వాయ్ ఒక్కసారిగా ఓ చోట ఆగింది. పవన్ కళ్యాణ్ కూడా అనూహ్యంగా దిగిపోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ ఆసక్తికర ఘటనకు ఓ బుడ్డోడు కారణమయ్యాడు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వెళుతుండగా ఆ చిన్నారి తన ఇంటి ముందు జనసేన జెండాను ఊపుతూ ఉత్సాహంగా నిల్చుని కనిపించాడు. బాలుడిని గమనించిన డిప్యూటీ సీఎం వెంటనే కాన్వాయ్ను ఆపారు. కారు దిగి ఆ కుర్రాడిని దగ్గరకు తీసుకుని కాసేపు కౌగిలించుకున్నారు. ఈ దృశ్యాన్ని స్థానికులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరించారు. దీంతో స్థానికులంతా ఆశ్చర్యపోయారు. పవన్ చాలా సింప్లిసిటీని ప్రదర్శించాడని, ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఉప్పాడ వెళ్లే దారిలో ఈ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మూడో రోజు పర్యటిస్తున్నారు. నేడు ఉప్పాడలో కోతకు గురైన సముద్ర తీరాన్ని పరిశీలించేందుకు వెళ్లారు. ఉప్పాడ ప్రాంతంలో జాలర్లు, సముద్రపు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించి గ్రామ గ్రామాన ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భారీగా ఆయనకు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. అనంతరం హార్బర్ సముద్ర తాబేళ్ల మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. సాయంత్రం 4 గంటలకు పిఠాపురం ఉప్పాడ సెంటర్లో జరిగే వారాహి బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్ ధన్యవాదాలు తెలిపే ప్రసంగం చేశారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి విజయవాడకు చేరుకుంటారు.