![Babu Quash Petition](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/09/1200-900-19609130-thumbnail-16x9-chandrababu-special-leave-petition-in-supreme-court.jpg)
Babu quash Petition Supreme Court : టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్క్వాష్ పిటీషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో తీర్పు వెల్లడి కానుంది. అవినీతి నిరోధకచట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ప్రతిపక్షనేతను అరెస్ట్ చేశారంటూ చంద్రబాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టులో సెప్టెంబర్ 23న స్పెషల్ లీవ్ పిటీషన్ ను దాఖలు చేశారు. సరైన మార్గదర్శకాలు పాటించకుండా చంద్రబాబును అరెస్ట్ చేసిన కారణంగా ఆయనపై మోపిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలంటూ దాఖలైన పిటీషన్ పై మంగళారం మధ్యాహ్నం 2 గంటలకు జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందుకు రానుంది.
చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, ఏపీ గవర్నమెంట్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్రోహత్గీ తమ వాదనలు వినిపించనున్నారు. శుక్రవారం కోర్టు పనివేళలు ముగిసే టైమ్ కి రాష్ట్ర ప్రభుత్వ వాదనలను వినిపించడం రోహత్గీ పూర్తి చేయలేదు. దీంతో మంగళవారం మధ్యాహ్నం వాదనలు రోహత్గీతోనే ప్రారంభం కానున్నాయి. తన వాదనలను పూర్తిచేయడానికి మరో అరగంట సమయం కావాలని గత విచారణ సమయంలోనే ఆయన ధర్మాసనానికి చెప్పుకున్నారు.
రోహత్గీ వాదనలు పూర్తయిన వెంటనే సాల్వే కౌంటర్ వాదనలు ప్రారంభించనున్నారు. మంగళవారం సాయంత్రానికల్లా ఇరు పక్షాల వాదనలు పూర్తవుతాయి. ఆ తర్వాత ధర్మాసనం తీర్పు ఇస్తుందా..లేదా తీర్పు రిజర్వ్ చేసి మరో రోజుకు వాయిదా వేస్తుందా చూడాలి. హైకోర్టులో తాను దాఖలుచేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి గత నెల 22న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సెప్టెంబర్ 23 నుంచి వాయిదాలతో కొనసాగుతూ వస్తున్నది.
చంద్రబాబు ఆరోగ్యం పరిస్థితిపై పిటిషన్..
రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై విజయవాడలోని ఏసీబీ కోర్టును కుటుంబసభ్యులు ఆశ్రయించారు. చంద్రబాబు హెల్త్ రిపోర్ట్ ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ మేరకు కుటుంబసభ్యుల తరపున చంద్రబాబు తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. వైద్యులు చంద్రబాబు ఆరోగ్యంపై నివేదిక ఎప్పటికప్పుడు కుటుంబసభ్యులకు ఇవ్వాలని పిటిషన్లో కోరారు. వైద్యులు రిపోర్టులు ఇవ్వడానికి నిరాకరించారని చంద్రబాబు లాయర్లు పిటిషన్లో పేర్కొన్నారు.
చంద్రబాబు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన రిపోర్టులు మెయిల్లో వచ్చాయని ఏసీబీ కోర్టు జడ్జి తెలిపారు. ఫిజికల్ కాపీ అందిన తర్వాత ఇస్తామని చంద్రబాబు లాయర్లకు జడ్జి చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు తమకు నివేదిక ఇవ్వలేదని, ఈ నెల 12న పరీక్షలు నిర్వహించిన తర్వాత జైలు అధికారులు కూడా తమకు ఎలాంటి రిపోర్ట్ ఇవ్వలేదని పిటిషన్లో పొందుపర్చారు. అధికారులు చెప్పిన అంశాలతోనే రిపోర్ట్ ఇస్తున్నారని కుటుంబసభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులతో పాటు పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొందని తెలిపారు. ఈ పిటిషన్పై ఇవాళ విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు తెలిపింది.
అయితే చంద్రబాబు ఆరోగ్యంపై గత కొంతకాలంగా ఏపీలో వివాదం నడుస్తున్నది. చంద్రబాబు బరువు తగ్గారని కుటుంబసభ్యులు చెప్పగా.. ఒక కేజీ బరువు పెరిగినట్లు జైలు అధికారులు పేర్కొంటున్నారు. చంద్రబాబు శరీరం రంగు మారిందని, చర్మంపై దద్దుర్లు, అలెర్జీ వచ్చినట్లు రాజమండ్రి ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ కలకలం సృష్టించింది. చంద్రబాబును చల్లని వాతావరణం ఉంచాలని వైద్యులు సూచించారు. పలు మెడిసిన్స్ కూడా రెఫర్ చేశారు. ఈ క్రమంలో చంద్రబాబుకు జైల్లో ఏసీ కల్పించాలని ఏసీబీ కోర్టులో బాబు లాయర్లు పిటిషన్ వేశారు. దీంతో బాబుకు ఏసీ సౌకర్యం కల్పించాలని జైలు అధికారులకు ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.