![Gajwel and Siddipet](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/KCR-Not-To-Take-Risk-With-Harish-Rao.jpg)
Gajwel and Siddipet : పార్లమెంట్ ఎన్నికలకు చివరి దశ పోలింగ్ నేటి (జూన్ 1)తో ముగుస్తుంది. ఈ రోజు సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. మూడు రోజుల తర్వాత అంటే జూన్ 4న కౌంటింగ్. అందుకు అధికారులు శరవేగంగా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీఆర్ఎస్ ఇప్పుడు అస్తిత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఉన్న నేపథ్యంలో విశ్లేషకుల నుంచి ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ చేతిలో ఘోర ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంత దయనీయ స్థితిలో ఉందంటే ఒక్క ఎంపీ సీటు గెలిచినా విజయం సాధించినట్లేనని అనుకుంటుంది. ఆ ఒకే ఒక్క సీటు కూడా మెదక్ సెగ్మెంట్ నుంచి వచ్చేలా కనిపిస్తోంది. అయినా ఇక్కడ రఘునందన్ రావు గట్టి పోటీనే ఇచ్చారు.
మెదక్ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ విజయం సాధించాలంటే ఇదే పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోకి వచ్చే గజ్వేల్, సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించాల్సి ఉంటుంది. గజ్వేల్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెందినది కాగా, సిద్దిపేట మరో బీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావుకు చెందిన నియోజకవర్గం. బీఆర్ఎస్ లో రెండు అతిపెద్ద తలలు ఇవే కావడంతో కనీసం ఒక్క సీటు అయినా తెచ్చుకునేందుకు ఈ ఇద్దరు దిగ్గజాల రాజకీయ బలం సరిపోతుందో లేదో చూడాలి.
ఒక్క ఎంపీ సీటు కూడా రాకుంటే బీఆర్ఎస్ మరింత కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉన్నా.. బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. కానీ ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకుంటే స్థానికంలో పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంటుందని బీఆర్ఎస్ ను ప్రజలు మర్చిపోతారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ భావిస్తోంది కాబట్టి బీఆర్ఎస్ కనీసం గజ్వేల్, సిద్దిపేట సహకారంతోనైనా మెదక్ ను దక్కించుకోగలుగుతుందా? చూడాలి.