![Mohan Babu](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/mohan-babu-revanth-reddy-1.jpg)
Mohan Babu : పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల కారణంగా ప్రచార బాధ్యతలు తీసుకున్న రేవంత్ రెడ్డి, అడ్మినిస్ర్టేషన్ పై పెద్దగా దృష్టి పెట్టలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఎన్నికలు ముగిసి ఎప్పటిలాగే పాలనమొదలైంది. ఒక్కో అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ముందుకు కదులుతున్నారు.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా డ్రగ్స్ కట్టడికి పోలీసుశాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ విషయంలో సినిమా వాళ్లను సైతం భాగస్వాములు కావాలంటూ షరతులు విధించారు.
సీఎం రేవంత్ షరతులివే..
‘‘సినిమా టికెట్ల ధరలు పెంచాలని, ప్రత్యేక షోలు వేసుకునేందుకు అనుమతి కావాలని ప్రభుత్వం దగ్గరకు వస్తున్నారు. కానీ సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలనే ప్రయత్నం సినీరంగంలోని వారు ఏ మాత్రం చేయడంలేదు. అది సినిమా మాధ్యమానికి ఉన్న కనీస బాధ్యతగా భావించాలి సూచిస్తున్నారు. . ఇకపై డ్రగ్స్, సైబర్ నేరాలపై సినిమాకు ముందుగానీ, తరువాత గానీ 3 నిమిషాల వీడియోతో అవగాహన కల్పించాలని కోరుతున్నారు. మెగాస్టార్ చిరంజీవిలా డ్రగ్స్ పై అవగాహన కల్పించాలని ఖరాఖండిగా చెబుతున్నారు. అలా చేయకపోతే వారి సినిమాలకు టికెట్ రేట్ల పెంపును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. షరతులను విస్మరిస్తే దర్శనిర్మాతలకు, నటీనటులకు తాము ఏ మాత్రం సహకరించమని, థియేటర్ల యాజమాన్యాలు కూడా ఇందుకు సహకరించాలి’’ అని రేవంత్ కోరారు.
ట్విట్టర్ లో స్పందించిన కలెక్షన్ కింగ్..
సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచనలపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు స్పందించారు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) లో ఆయన పోస్ట్ పెట్టారు. డ్రగ్స్కు యువత బలి అవుతున్న విషయం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా నటీనటులను 1 లేదా 2 నిమిషాల నిడివిలో వీడియో చేసి, ప్రభుత్వానికి పంపించమన్నారు. తాను ఇంతకు ముందే ఇటువంటి వీడియోలు కొన్ని చేశానని, అయినా సీఎం ఆదేశాల మేరకు సందేశాత్మకమైన కొన్ని వీడియోలు రూపొందించి ఉడతా భక్తిగా సమాజానికి సేవ చేసుకుంటానని ఎక్స్ లో రాశారు. తన పోస్ట్కు రేవంత్, సీఎంవో ఎక్స్ ఖాతాలను కూడా మోహన్ బాబు ట్యాగ్ చేశారు.