![Srikakulam](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/WhatsApp-Image-2024-06-02-at-9.21.46-AM.jpeg)
Srikakulam : శ్రీకాకుళం జిల్లాలో ‘ఓ తల్లికి కడుపుకోత’ పేరిట వెలసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పాముకాటుకు, ముల్లు గుచ్చుకోవడానికి తేడా తెలియని స్థితిలో వైద్యులు ఉన్నారని ప్రజలు మండిపడుతున్నారు.
శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలం, రావివలస పంచాయతీ చిన్ననారాయణపురం గ్రామానికి చెందిన మురళి, నిరోషా దంపతులకు సాయివినీత్ (12) అనే కుమారుడు ఉన్నాడు. మే 21న సాయివినీత్ పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుకుంటుండగా బాల్ పక్కనే ఉన్న పొదల్లో పడింది. ఈ క్రమంలో ఆ బాల్ ను తీసుకు వచ్చేందుకు సాయివినీత్ పొదలోకి వెళ్లాడు. ఆ పొదలో సాయివినీత్ ను ఏదో కరిచింది. దీనితో కాసేపటికి సాయివినీత్ స్పృహ కోల్పోయాడు. దీంతో వెంటనే బాలుడ్ని కుటుంబ సభ్యులు టెక్కలిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
అయితే బాలుడికి ఏం జరిగిందో పరీక్షించకుండా ముల్లు గుచ్చుకుని ఉంటుందేమోనని వైద్యులు భావించారు. ముల్లు గుచ్చుకుంటే ఎవరైనా స్పృహ కోల్పోతారా అనే ఆలోచన కూడా చేయకుండా బాలుడికి తగిన వైద్యం అందించలేదు. సుమారు రెండు గంటలపాటు వైద్యులు నిర్లక్ష్యం చేశారు. దీంతో బాలుడి పరిస్థితి విషమించింది. ఈ నేపథ్యంలో తమ వల్ల కాదని చేతులెత్తేసిన వైద్యులు శ్రీకాకుళంలోని రిమ్స్ కు తీసుకు వెళ్లాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు సాయివినీత్ ను అంబులెన్స్ లో తరలిస్తుండగా నరసన్నపేట చేరుకునేసరికి బాలుడి పరిస్థితి విషమించింది. అక్కడ ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా సాయివినీత్ మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.
ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు. కొడుకు మృతుని జీర్ణించుకోలేని తల్లి మే 22న నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే, అంతటి బాధలోనూ తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతో ఓ వినూత్న నిరసన చేపట్టారు.
‘ఓ తల్లికి కడుపుకోత’ అంటూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తూ టెక్కలిలో పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల ద్వారా మాకు కడుపుకోత మిగిల్చిన మీకు శ్రద్ధాంజలి. పాముకాటుకు, ముల్లు గుచ్చుకోవడానికి తేడా తెలియని మీకు శతకోటి వందనాలు అంటూ వైద్యుల నిర్లక్ష్యం తీరును ఎండగట్టారు. దీంతో బాలుడి పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యుల తీరు చర్చనీయాంశమవుతోంది.