EVM dispute : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల (ఈవీఎంలు) పనితీరుపై దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదని, ఏఐ పరిజ్ఞానంతో వాటిని సులభంగా హ్యాక్ చేయవచ్చని టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ చేసిన ట్వీట్ తీవ్ర కలకలం రేపుతోంది. ఈవీఎంలను మనుషులు కూడా హ్యాక్ చేసేందుకు ఆస్కారం ఉందని, అసలు వీటిని రద్దు చేయాలని ఎలాన్ మస్క్ డిమాండ్ చేయడం గమనార్హం. మరోవైపు ముంబైలో గెలుపొందిన శివసేన (షిండే) అభ్యర్థి రవీంద్ర వైకర్ బంధువు ఒకరు మొబైల్ ద్వారా ఈవీఎంను హ్యాక్ చేసి ఆపరేట్ చేసినట్లు వస్తున్న వార్తల ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ప్రశ్నార్థకంగా మారుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సైతం ఈవీఎంల పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఓటింగ్ సరళిపై ఇప్పటికే పలువురు నిపుణులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఈవీఎంల పనితీరుపై సర్వత్రా సందేహాలు తలెత్తున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఈవీఎం హ్యాకింగ్పై వచ్చిన ఆరోపణలను సీనియర్ ఎన్నికల అధికారి ఖండించారు. కమ్యూనికేషన్ కోసం ఎటువంటి సదుపాయం లేని ఫూల్ప్రూఫ్ స్వతంత్ర పరికరం ఈవీఎం అని తెలిపారు. ఈవీఎం తెరిచేందుకు మొబైల్ ఫోన్, ఓటీపీ అవసరం లేదన్నారు. ఇటు టీడీపీ నాయకులు సైతం ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం పైన చాపకిందనీరులా భారీ వ్యతిరేకత ఏర్పడిందని అందువల్లే ఓటర్లు జగన్ ను గద్దె దించాలని నిర్ణయించినట్లు వారు చెబుతున్నారు. జగన్ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలవ్వడానికి సభాలక్ష కారణాలున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ఒంటెత్తు పోకడలు, సంక్షేమం పేరుతో అభివృద్ధిని విస్మరించటం, ఎంఎల్ఏలను, నేతలను జగన్ పట్టించుకోకపోవటం, ఉద్యోగుల పట్ల అనుచిత వైఖరి, అభ్యర్థులను ఇష్టమొచ్చినట్లు మార్చటం, మంత్రులుగా ఉన్న ఆర్కె రోజా, పేర్ని నాని, కొడాలి నాని, అంబటి రాంబాబు, అనిల్కుమార్ యాదవ్ వంటివారి నోటి దురుసును ఆపకపోవడం, మద్యం విధానంలో నిజాయితీ లోపించటం , ముఖ్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక ప్రభావాన్ని అంచనా వేయకపోవటం కూడా జగన్ ఓటమికి కారణంగా చెప్పుకోవచ్చు. వాటిని వదిలేసి ఈవీఎంలు హ్యాకింగ్ జరిగాయని ఆరోపించడం ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం తప్పా మరొకటి కాదు.
అయితే రాజకీయ పార్టీలు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నాయని అంటున్నారు. వాస్తవానికి ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ఈవీఎం ట్యాంపరింగ్ జరుపడం కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే 2004లో ఎన్డీఏ హయాంలో తొలిసారిగా దేశవ్యాప్తంగా ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిపారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ఘన విజయం సాధించింది. ఇక ఆ తర్వాత 2014లో యూపీఏ ను ఓడించి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది. అలాగే తాజా 2024 ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ సొంతంగా మ్యాజిక్ ఫిగర్ ను దాటలేకపోయింది. అలాగే ఉమ్మడి ఏపీలో తీసుకుంటే 2014 ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలోనే ఓడిపోయింది. అలాగే ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. ఇలా ఏ రకంగా చూసినా ఈవీఎంల ట్యాంపరింగ్ చేయాలనుకుంటే వరుసగా అధికారంలోకి రావొచ్చు. కానీ అలా రావడం లేదు కదా. ఇక ఈవీఎంల ట్యాంపరింగ్ ను రాష్ట్ర పార్టీలు చేసే అవకాశమే ఉండదు. మరి వైసీపీ ఆరోపణలు ఎందుకు చేస్తుందో వారికే తెలియాలి. వైసీపీ దుర్మార్గ పాలనను పాతిపెట్టాలని జనాలు ఫిక్స్ అయ్యారు..ఎన్నికల్లో దారుణంగా ఓడించారు. దానిపై ఆత్మవిమర్శ చేసుకోకుండా తమ ఓటమిని ఈవీఎంలపై నెట్టివేయడం కచ్చితంగా అసమర్థ రాజకీయమే.