![First Rank](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-14-4.jpg)
First Rank : నీట్-2024 ఫలితాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. దీనిపై వస్తున్న ఆరోపణలను, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకొని వెంటనే దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. తొలుత నీట్ ప్రశ్నాపత్రం లీకైందన్న ఆమె.. ఇప్పుడు ఫలితాల్లోనూ కుంభకోణం జరిగినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారని తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు 720 కి 720 మార్కులు రావడంపై అనుమానాలు వస్తున్నాయని చెప్పారు. విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు.
మరోవైపు నీట్ ఫలితాల వెల్లడి అనంతరం పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంపై ప్రియాంక దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష ఫలితాలపై పలువురు అభ్యర్థులు, తల్లిదండ్రులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.