![KCR](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/02/kcr-.webp)
KCR : కరెంటు కొనుగోళ్లు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అక్రమాలు, అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కేసీఆర్ ను నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేసీఆర్ కూడా విచారణ జరుపుతున్న నరసింహాడ్డి కమిషన్ రద్దు చేయాలంటే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పై హైకోర్టు తీర్పును రిజర్వు లో పెట్టింది. ఇప్పటికే కేసీఆర్ తరపు అడ్వకేట్ కోర్టులో వాదనలు వినిపించగా నేడు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తన వాదనలు వినిపించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విద్యుత్తు కొనుగోళ్లపై ఎంక్వయిరీ చేయించుకోమని నేరుగా అసెంబ్లీలో మాట్లాడారని, ఎంక్వయిరీ చేయమని వాళ్లే కోరినప్పుడు కమిషన్ ఏర్పాటు చేశారని, అలాంటప్పుడు ఈ కమీషన్ ఏకపక్ష కమీషన్ ఎలా అవుతుందో చెప్పాలని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ప్రశ్నలు లేవనెత్తారు. జస్టిస్ నరసింహారెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ లో ఎక్కడా ఏకపక్షంగా మాట్లాడలేదన్నారు.
నిబంధనల ప్రకారమే కేసీఆర్ కి రెండుసార్లు నోటీసులు ఇచ్చామని, విద్యుత్తు కొనుగోలు వ్యవహారంపై పబ్లిక్ నోటీసు సైతం జారీ చేశామన్నారు. ఈ వ్యవహారంలో విచారణ మొత్తం బహిరంగంగానే జరుగుతుందని, ఇప్పటివరకు 15 మంది నుండి వివరాలు సేకరించామని కోర్టుకు తెలిపారు. ఈ 15 మందిలో మాజీ సీఎండి ప్రభాకర్ రావు తో పాటు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కూడా ఉన్నట్లు తెలిపారు. నిబంధనల ప్రకారమే విచారణ జరుపుతున్నామని వారు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ కు కూడా నోటీసులు ఇచ్చి ఆధారాలు ఇవ్వాలని మాత్రమే కోరామని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. అంతకుముందు జూన్ 27వ తేదీన కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ ఆదిత్య సోంధి వాదనలు వినిపించారు. జూన్ 30వ ఎంక్వయిరీ కమిషన్ గడువు ముగుస్తుందని, ఈలోగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని కాబట్టి కమిషన్ విచారణ పై స్టే ఇవ్వాలని కేసీఆర్ తరపు న్యాయవాది కోరారు. దీంతో నేడు విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వులో పెట్టింది.