CM Jagan : ప్రజలకు మంచి చేసి తాను ఒక్కడినే ఎన్నికలకు వస్తుంటే.. పదిమందిని వెంటబెట్టుకుని ఎందుకు వస్తున్నావని చంద్రబాబును సిఎం జగన్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో మేమంతా సిద్ధం బస్సుయాత్ర 19వ రోజు అనకాపల్లి జిల్లాలో కొనసాగుతోంది. శనివారం చింతపాలెం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో జగన్ పాల్గొని మాట్లాడారు.
ఈ మధ్య చంద్రబాబు తనను బచ్చా అంటున్నాడు, తాను బచ్చా అయితే తన చేతిలో చిత్తుగా ఓడిపోయి కేవలం 23 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న నిన్ను ఏమనాలని ప్రశ్నించారు. నేను బచ్చా అయితే పదిమందిని పోగేసుకుని ఎన్నికలకు వస్తున్న చంద్రబాబు ఉక్రోశం, కడుపుమంటతో తనమీద రాళ్లు వేయమంటున్నాడని ఆరోపించారు. నా మీద యుద్ధం చేయమంటున్నాడు. ఇది చంద్రబాబు, దత్తపుత్రుడు వాళ్ల వదినమ్మల ఎజండా అని, రాష్ట్రాన్ని దోచుకోవడానికి, దోచుకున్నది దాచుకోవడానికి వాళ్లు అధికారం కోసం ఆరాటపడుతున్నారు అని సిఎం జగన్ ఆరోపించారు.