Radhika Mangipudi : వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ‘నెల నెలా తెలుగు వెన్నెల’లో భాగంగా 178వ సాహిత్య కార్యక్రమం హైదరాబాద్ లోని త్యాగరాయ గాన సభలో మంగళవారం (జనవరి 9)న జరిగాయి. ఇందులో ‘రాధిక మంగిపూడి రచనలపై సమీక్షా ప్రసంగాలు’ నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు, వంగూరి ఫౌండేషన్ (ఇండియా) మేనేజింగ్ ట్రస్టీ, డాక్టర్ వంశీ రామరాజు పాల్గొని మాట్లాడారు. ‘వంగూరి ఫౌండేషన్ కొన్నేళ్లుగా ప్రతి నెలా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. సింగపూర్ నుంచి తొలి రచయిత్రిగా గుర్తింపు రాధిక ‘మంగిపూడి’ రచించిన ఐదు పుస్తకాలపై ప్రత్యేక సమీక్ష ప్రసంగాలను ఏర్పాటు చేశాం. అతిథులుగా ప్రఖ్యాత రచయితలు, రచయిత్రులు సమీక్ష చేయడం ఎంతో ఆనందంగా ఉంది’ అని ఆయన అన్నారు.
సభకు ముఖ్య అతిథిగా సాహితీవేత్త డా. కొలకలూరి ఇనాక్ హాజరై రాధిక రచనలను అభినందించారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిటైర్డ్ రిజిస్ట్రార్ ఆచార్య గౌరీశంకర్ ‘భారతీయ తత్త్వ శతకం’ అనే పద్య శతకం, ప్రముఖ సినీ కవి డా. వడ్డేపల్లి కృష్ణ ‘నవ కవితా కదంబం’ సంపుటి, హాస్యబ్రహ్మ డా. శంకర నారాయణ ‘అల సింగపురంలో’ కథా సంపుటి, రచయిత్రి డా. తిరునగిరి దేవకీదేవి ‘మరో మాయాబజార్’ కథా సంపుటి, ప్రముఖ రచయిత్రి డా. కేతవరపు రాజ్యశ్రీ ‘భావతరంగాలు’ కవితా సంపుటిపై అద్భుతమైన సమీక్షలు చేసి రాధికను ఆశీర్వదించారు.
రచయిత రాధిక మంగిపూడి మాట్లాడుతూ.. ‘తన రచనలను ‘వంగూరి ఫౌండేషన్’ ఆది నుంచి ప్రోత్సహింది. తన రచనల్ని ఎంపిక చేయడం, ఆచార్య ఇనాక్ వంటి పెద్దలు, ప్రముఖ రచయితలు, సాహితీవేత్తలు తమను ఆశీర్వదించడం ఆనందంగా ఉంది. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డా. వంగూరి చిట్టెన్ రాజు, వంశీ రామరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ అధ్యక్షుడు కవుటూరు రత్నకుమార్, వివిధ దేశాలకు చెందిన తెలుగు సంస్థల ప్రతినిధులు నన్ను అభినందించారు. వంగూరి ఫౌండేషన్ (ఇండియా) ట్రస్టీ శైలజా సుంకరపల్లి నిర్వహణ బాధ్యతలు తీసుకోగా, మునమర్తి కృష్ణవేణి సభా వ్యాఖ్యాతగా వ్యవహరించారు.