![ISRO Chief](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/isro-chief-1641997984.jpeg)
ISRO Chief Warning : ఇటీవల నాసా ఒక హెచ్చరిక చేసింది. భారీ గ్రహశకలం ఒకటి భూమిని ఢీ కొట్టే అవకాశం వందకు వంద శాతం ఉందని దీన్ని ఎవరూ తప్పించలేరని వెల్లడించింది. అప్పటికి శాస్త్ర సాంకేతిక రంగం ఎలా మారుతుంది. శాస్త్రవేత్తలు ఏం చేయాలన్నదానిపై ఆలోచనలు జరుగుతున్నాయని చెప్పింది. ఈ నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్త కూడా దీనిపై స్పందించారు.
నాసా చెప్పినట్లుగా గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే అవకాశాలు ఉన్నాయని ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు. ఇది జరిగితే మానవాళితో పాటు భూమి పై ఉన్న అధిక శాతం జీవరాశి అంతం అవుతుందని హెచ్చరించారు. ప్రపంచ గ్రహశకల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇస్రో ఓ వర్క్ షాపు నిర్వహించింది. ఇందులో ఇస్రో చీఫ్ పాల్గొన్నారు. అనంతరం, మీడియాతో పలు విషయాలపై ముచ్చటించారు.
‘ఇప్పుడున్న మనుషుల జీవితకాలం 70 – 80 ఏళ్లే. కాబట్టి ఇలాంటి విపత్తులను చూడకపోవచ్చు. గ్రహశకలాలు భూమిని ఢీకొట్టే ప్రమాదాన్ని తక్కువ అంచనా వేస్తాం. కానీ చరిత్రలో ఇలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తరచూ భూమిని శకలాలు ఢీకొడుతుంటాయి. గురుగ్రహాన్ని ఓ గ్రహశకలం ఢీకొట్టడాన్ని నేను టెలీస్కోప్ ద్వారా చూశా. అలాంటి శకలమే మన భూమిని ఢీ కొడితే మనందరం అంతరించిపోతాం. ఇవి కచ్చితంగా జరుగుతాయి. కాబట్టి మనం సిద్ధంగా ఉండాలి.
పుడమి తల్లిని ఇలాంటి విపత్తుల నుంచి రక్షించాలి. భూమివైపునకు దూసుకొచ్చే గ్రహశకలాలను దారి మళ్లించే టెక్నాలజీ మానవాళి వద్ద ఉంది. భూమికి సమీపంగా ఉన్న వాటిని ముందుగా గుర్తించి ప్రమాదం నివారించొచ్చు. అయితే, ఒక్కోసారి ఇది సాధ్యంకాకపోవచ్చు. భారీ వ్యోమనౌకలతో ఢీకొట్టించి దారి మళ్లించాలి. ఇందుకు ప్రపంచదేశాలు ఉమ్మడిగా విధానాలు రూపొందించాలి’ అన్నారు.
భవిష్యత్తులో ఈ ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయని ఆశిస్తున్నాం అన్నారు. ప్రమాదం తప్పదన్న సమయంలో మానవాళి ప్రమాద నివారణకు నడుం బిగిస్తుందన్నారు. అంతరిక్ష రంగంలో ముందడుగేస్తున్న ఇస్రో ఈ దిశగా బాధ్యత తీసుకుంటుందన్నారు. కేవలం భారత్ కోసం కాకుండా ప్రపంచ క్షేమం కోసం రాబోయే విపత్తును నివారించేందుకు అవసరమైన సాంకేతిక, ప్రోగ్రామింగ్ సామర్థ్యాలను సిద్ధం చేసుకోవాలని పిలుపునిచ్చారు.