Challenges to Chandrababu : ఇటీవల ఎన్నికలు పూర్తయ్యాయి. టీడీపీ కూటమి భారీ మెజార్టీతో గెలిచింది. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేశారు. దీంతో ఏపీలో కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో కొలువుదీరింది. చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి.. జూలై 1 నాటికి రూ. 10,500 కోట్లు కావాలి. అందులో పెన్షన్లకు 4,500 కోట్లు. జీతాలకు 6,000 కోట్లు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కూడా భారీగా హామీలు గుప్పించారు. రైతులకు ఏటా రూ 20 వేలు. స్కూలుకు వెళ్లే ప్రతి బిడ్డకు 15 వేలు. 18 నుంచి 59 ఏళ్ల దాకా ప్రతి మహిళ కు 15 వేలు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఇవి సూపర్ సిక్స్ లో భాగంగా ఇచ్చిన హామీలు.
ఇవే ఇప్పుడు చంద్రబాబు ముందున్న పెను సవాళ్లు. అసలే ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకు పోయింది. మరో శ్రీలంకగా మారిపోతుందన్న ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. వేల కోట్ల అప్పులు, పప్పు బెల్లాల్లా నగదు పంపిణీలతో రాష్ట్ర ఖజానా ఖాళీ అవడమే కాక ప్రభుత్వ భూములు కూడా తాకట్టు పెట్టేస్థాయికి గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ప్రతినెలా ఒకటో తేదీ జీతాలివ్వలేని దుస్థితి నెలకొంది. జగన్ రెడ్డి బటన్ నొక్కి రాష్ట్రాన్ని రుణగ్రస్తం చేశారని నిన్న మొన్నటి దాకా అప్పటి ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ ఆరోపించింది.
జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు తిరస్కరించారు. చంద్రబాబుకు మళ్లీ అధికారం అప్పజెప్పారు. కాకపోతే జగన్ అందించిన పథకాల కన్నా ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకిచ్చిన పథకాల విలువ చాలా ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే దాదాపు రెట్టింపు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనూ, పార్టీ తరపున ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో కూడిన మ్యానిఫెస్టోను అమలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న చంద్రబాబుపై ఉంది. దీనిని బాధ్యత అనే కంటే చంద్రబాబుకు సీఎం కాగానే ఎదురవుతున్న భారీ సవాలనే చెప్పాలి. ఈ సవాల్ ను అధిగమించాలంటే ఆయన భారీ కసరత్తే చేయాలి. చంద్రబాబు పరిపాలన దక్షత, అనుభవం, సమర్థతతో వాటిని అధిగమించాలని ప్రజలు కోరుకుంటున్నారు.