![Komatireddy Brothers](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-6-23.jpg)
Komatireddy Brothers : సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చిన మాటను కోమటిరెడ్డి బ్రదర్స్ నిలబెట్టుకున్నారు. చెప్పినట్టుగానే చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించి ఎంపీ సీటును సీఎం రేవంత్ కు బహుమతిగా ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి చెప్పిన విధంగానే 5 లక్షలకు పైగా మెజార్టీతో నల్గొండ ఎంపీగా రఘువీర్ రెడ్డిని గెలిపించుకున్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసిన తర్వాత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లిన సంగతి తెలిసిందే. అనంతరం భువనగిరి నియోజకవర్గ ఇన్ చార్జిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు.
అనంతరం ఏప్రిల్ 21న నియోజకవర్గ కేంద్రమైన భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆ సమయంలోనే మా తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డికి తాము కుడి, ఎడమ భుజాలుగా ఉంటామని తెలిపారు. భువనగిరి ఎంపీ సీటును గెలిపించుకొని సీఎం రేవంత్ కు గిఫ్ట్ గా ఇస్తామని ప్రకటించారు. ఇచ్చిన మాటకు తగ్గట్టుగానే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నీ తానై ఎన్నికల ప్రచారం నిర్వహించారు.