Mallareddy VS Revanth Reddy : పాలమ్మిన.. పూలమ్మినా అంటూ ఓ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పాపులర్ అయిన మాజీ మంత్రి మల్లారెడ్డి పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగబట్టారా?.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది బీఆర్ఎస్ నేతలు భూకబ్జాలు, అక్రమాలకు పాల్పడిన వారుండగా.. కేవలం మంత్రి మల్లారెడ్డి ఆక్రమాస్తుల పైనే వరుస దాడులు ఎందుకు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్దల కాళ్లా వేళ్లా పడి రేవంత్ తో రాజీ కుదర్చుకోవాలని చూసినా ఆయనను ప్రస్తుతం ఎవరూ పట్టించుకోవడం లేదు ఎందుకనీ ? తెలంగాణ రాజకీయ చదరంగంలో బుర్ర బద్దలు కొడుతున్న ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎంతకీ అంతు చిక్కడం లేదు. అయితే మల్లారెడ్డి గతంలో చేసిన ఒక పెద్ద తప్పే ప్రస్తుత తన పరిస్థితికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఈ మధ్యకాలంలో మాజీ మంత్రి మల్లా రెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన భూవివాదాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ కాలంలో మల్లారెడ్డిపై వరుసగా భూకబ్జా ఆరోపణలు వచ్చినా అధికారు పట్టించుకోలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీరాగానే ఆక్రమణదారులను గుర్తించి కూల్చివేతలు చేపట్టడంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
గతంలో మల్లారెడ్డి అధికార అహంకారంతో రేవంత్ రెడ్డిని పరుష పదజాలంతో దుర్భాషలాడడం.. తొడగొట్టి సవాల్ చేయడం వంటి చేష్టలు ఆయన మనసులో బలంగా నాటుకుపోవడం వల్ల ముఖ్యమంత్రి అయ్యాక మల్లారెడ్డిపై పూర్తి దృష్టి పెట్టారేమో అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. వాస్తవానికి భూ వివాదానికి సంబంధించి సీఎం వద్దే తేల్చుకుంటానని ఇటీవల రేవంత్ రెడ్డి అపాయింట్ మెంట్ కోరారు మల్లారెడ్డి. బుధవారం ఆయనను కలుసుకోనున్నట్లు తెలిపారు. కానీ, ఆయనకు రేవంత్ అపాయింట్ మెంట్ ఇచ్చేందుకు రెడీగా లేరు. ఈ వివాదాల నుంచి రేవంత్ రెడ్డి ఎలా బయటపడతారో చూడాలి.