Rohit Sharma : టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టుకు స్వాగతం పలికేందుకు ముంబై మొత్తం వీధుల్లోకి వచ్చినట్లు అనిపించింది. భారత జట్టు విజయోత్సవ ర్యాలీ సందర్భంగా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. వేలాది మంది అభిమానులు తమ క్రికెటర్లను చూసేందుకు తహతహలాడారు. పరేడ్ సాగుతున్నంత సేపు ముంబై జనసంద్రంగా మారింది. ఒక దశలో దక్షిణ ముంబై ట్రాఫిక్ వ్యవస్థ స్తంభించిపోయింది. అభిమానుల ప్రేమను చూసి క్రికెటర్లు కూడా ఆనందపరవశులయ్యారు. నగరంలో జోరుగా వర్షం కురిసినా అభిమానుల ఉత్సాహానికి అడ్డుకట్ట వేయలేకపోయింది. స్టేడియం అభిమానులతో కిక్కిరిసిపోయింది. వారి అచంచలమైన అంకితభావం, క్రికెట్ పట్ల వారికున్న మక్కువ స్పష్టంగా కనిపించింది.
విజయోత్సవ ర్యాలీ షెడ్యూల్ ప్రకారం 5 గంటలకు నారిమన్ పాయింట్లోని నేషనల్ సెంటర్ ఫర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ నుంచి ప్రారంభమై రాత్రి 7 గంటలకు వాంఖడే స్టేడియంలో ముగియాలి. కానీ టీమిండియా ప్లేయర్లు న్యూఢిల్లీ నుంచి ముంబైకి ఆలస్యంగా చేరుకున్నారు. పరేడ్ 7.30 గంటల తర్వాత ప్రారంభమైంది. సాధారణంగా ఈ దూరాన్ని అధిగమించడానికి కేవలం ఐదు నిమిషాలు పడుతుంది. వేలాదిగా తరలివచ్చిన అభిమానుల తాకిడితో ఈ ర్యాల గంటకు పైగా సాగింది.
ముంబై కా రాజా అంటూ నినాదాలు..
2007లో భారత జట్టు టీ20 ప్రపంచకప్ను గెలుచుకున్నప్పుడు జట్టులో రోహిత్ శర్మ అతి పిన్న వయస్కుడు. ఇప్పుడు 37 ఏళ్ల వయసులో తన కెప్టెన్సీలో ఈ ఘనత సాధించాడు. ర్యాలీ సందర్భంగా వీధుల్లోకి వచ్చిన అభిమానులు రోహిత్పై తమ అమితమైన ప్రేమను చూపించారు. ర్యాలీలో ‘ముంబై కా రాజా ‘రోహిత్ శర్మ’ అనే నినాదాలు ప్రతిధ్వనించాయి. ఇక స్టేడియంలో ఏర్పాటు చేసిన వేదికపైకి రోహిత్ శర్మ వచ్చినప్పడు ఆ నినాదాలు మరింత పెరిగాయి. రోహిత్.. రోహిత్ అంటూ అభిమానులు దిక్కులు పిక్కటిల్లేలా హోరెత్తించారు. ఒక్కసారిగా ఈ దృశ్యం బాహుబలి సినిమాను గుర్తుకు తెచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో అభిమానులు పోస్టులు పెడుతూ తమ ఆనందాన్ని మరింత పంచుకుంటున్నారు.