Panyam Constituency Review :
వైసీపీ : కాటసాని రాంభూపాల రెడ్డి (ప్రస్తుత ఎమ్మెల్యే)పాణ్యం.. గతంలో ఫాక్ష్యన్ రాజకీయాలకు కేంద్రం. ఈ నియోజకవర్గం గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇక్కడి నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని రాం భూపాలరెడ్డి 8సార్లు పోటీ చేయగా, ఆరు సార్లు గెలిచారు. రెండు సార్లు టీడీపీ గెలిచింది. అయితే 2024 ఎన్నికలు పాణ్యంలో వేడిని పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం కాటసాని రాంభూపాల రెడ్డి వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి గౌరు చరిత మరోసారి బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వైసీపీ నుంచి యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలకు పాణ్యం పెట్టింది పేరు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వాటిపై పూర్తి స్థాయి దృష్టి పెట్టారు. ఆ తర్వాత కొంత తగ్గుముఖం పట్టినా, మళ్లీ ఇటీవల జరిగిన ఓ ఘటన భయాన్ని రేపింది. అయితే ఏడోసారి ఇక్కడి నుంచి గెలవాలని కాటసాని భావిస్తున్నారు. తద్వారా జగన్ దృష్టిలో పడి, మంత్రి పదవిని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. పూర్తి ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కాటసాని రాంభూపాలరెడ్డి ఈసారి కూడా గెలవాలని అనుకుంటున్నారు. అయితే అభివృద్ధి విషయంలోనే తన ఆలోచన ఉందని చెబుతున్నారు.
అయితే టీడీపీ కూడా 2024 ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ఉంది. నంద్యాల టీడీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకట్ రెడ్డి ఇక్కడి రాజకీయాలను చూసుకుంటున్నారు. 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరిన గౌరు చరితారెడ్డి ఈ సారి పోటీకి సై అంటున్నారు. 2024 ఎన్నికల్లో ఈ సారి గెలుపుపై దృష్టి పెట్టారు. అయితే రెండు కుటుంబాలకు నియోజకవర్గంలో ఆదరణ బలంగా ఉంది. ఉమ్మడి కర్నూల్ జిల్లాలో అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గంగా పాణ్యం కు పేరుంది. 2. 85 లక్షల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉన్నారు. ఇందులో ఎస్సీ ఓటర్లే ఎక్కువ. గ్రామీణ ప్రాంత ఓటర్లే ఇక్కడ కీలకం కానున్నారు. అయితే గతంలో ఉన్న భయం నీడలు ఇప్పుడు లేకపోయినా, ఈ ఛాయలు ఇంకా పోలేదు. 2024 ఎన్నికల్లో ఇద్దరు బలమైన అభ్యర్థులు పోటీలో నిలబడుతుండగా, మరి గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.