![CM Chandrababu](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-14-1.jpg)
CM Chandrababu : రాష్ట్రానికి ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్టు అనేక సంక్షోభాలను ఎదుర్కొందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం మొదటగా ఈరోజు చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పనుల పురోగతిపై జల వనరుల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత విలేకరులతో చంద్రబాబు మాట్లాడారు.
పోలవరం ప్రాజెక్టు కోసం తాను పడిన కష్టాన్ని జగన్ బూడిదలో పోశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి ఆటంకాలు రాకూడదనే ఉద్దేశంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసేలా ఆనాడు కేంద్రాన్ని ఒప్పించామన్నారు. జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చేర్చడంతో టీడీపీ హయాంలోనే 72 శాతం ప్రాజెక్టు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం రాగానే రివర్స్ టెండరింగ్ చేపట్టారని, ఏజెన్సీతో పాటు సిబ్బందినీ మార్చారని అన్నారు. డయాఫ్రమ్ వాల్ ను గత ప్రభుత్వం కాపాడుకోలేదని, పోలవరం విషయంలో జగన్ క్షమించరాని తప్పులు చేశారని తెలిపారు.
‘‘ఈ ప్రాజెక్టుపై వందసార్లు సమీక్షించా.. 30 సార్లు సందర్శించా. రూ.446 కోట్లతో మరమ్మతులు చేసినా బాగవుతుందనే పరిస్థితి లేదు. సమాంతరంగా డయాఫ్రమ్ వాల్ కడితే రూ.990 కోట్లు ఖర్చవుతుంది. గతంలో ప్రాజెక్టు కొనసాగి ఉంటే 2020 చివరి నాటికి పూర్తయ్యేది. పోలవరం పూర్తికి నాలుగు సీజన్లు కావాలని అధికారులు చెబుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితేనే నాలుగేళ్లు పడుతుందని అధికారులు అంటున్నారు’’ అని చంద్రబాబు వెల్లడించారు.