![Red Book](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/YSRCP-psychos-getting-scared-of-red-book-says-Lokesh.jpg)
Red Book : వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి (2019) నుంచి అకారణంగా తెలుగుదేశం పార్టీ నేతలను ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లను రెడ్ బుక్ లో నమోదు చేస్తున్నట్లు వారి సంగతి తమ ప్రభుత్వం వచ్చినంక చూసుకుంటామని నారా లోకేశ్ హెచ్చరిస్తూ వస్తున్నారు. లోకేశ్ హెచ్చరికలపై సీఐడీ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు. బాబు బెయిల్ రద్దు వాదనల సమయంలో సుప్రీంలోనూ రెడ్ బుక్ ప్రస్తావన వచ్చింది.
అయితే, ఇప్పుడు రెడ్ బుక్ అమలు అంశం తెరపైకి వచ్చింది. దీంతో అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తర్వాత లోకేశ్ మీడియాతో మాట్లాడారు. కక్ష సాధింపు తమ ప్రభుత్వంలో ఉండబోదని స్పష్టం చేసిన సమయంలో.. రెడ్ బుక్ గురించి విలేకరులు ప్రస్తావించారు. కక్ష సాధింపు ఉండదని కానీ నిబంధనలు ఉల్లంఘించిన వారిని వదిలేది లేదని మాత్రం చెప్పారు. చట్ట పరిధిని దాటిన ప్రతీ ఒక్కరి పేర్లు రెడ్ బుక్ లో ఉన్నాయని గుర్తు చేశారు. అంటే రెడ్ బుక్ గురించి చెప్పకనే చెప్పారు. దీంతో అధికారుల్లో గుబులు మొదలైంది.
కొంత మంది అధికారులను వెనక్కి పంపిన సిబ్బంది..
తాము ప్రతిపక్షంలో ఉన్న ఐదేళ్లు కొందరు అధికారులు వ్యవహరించిన తీరు, తమపై తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా.. వారు వ్యవహరించిన తీరుపై టీడీపీ గుర్రుగా ఉంది. అలాంటి వారిని క్షమించే ప్రసక్తి లేదని సంకేతాలు వస్తున్నాయి. చంద్రబాబు గెలిచిన తర్వాత విషెస్ చెప్పేందుకు చాలా మంది అధికారులు ఉండవల్లిలోని ఆయన నివాసానికి వస్తున్నారు. అయితే బాబు మాత్రం అందరికీ ఛాన్స్ ఇవ్వడం లేదు. కొందరిని తిప్పి పంపించేస్తున్నారు.
మాజీ సీఎస్ జవహర్ రెడ్డికి బాబును కలిసేందుకు రావడంతో ముభావంగానే అనుమతించారు. కేవలం బొకే ఇవ్వడంతో పంపించి వేశారు. ఆయన తీరుపై బాబు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. జవహర్ రెడ్డి రిటైర్మెంట్ వచ్చే నెల (జూలై)లో ఉండడంతో అప్పటి వరకు సెలవులపై ఉండాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇక మరో అధికారి సీఐడీ చీఫ్, ఐపీఎస్ అధికారి సంజయ్ కూడా బాబును కలిసే ప్రయత్నం చేశారు. కానీ ఆయనకు బాబు పిలుపు ఇవ్వలేదు. ఫలితాలు వచ్చిన వెంటనే లీవు పెట్టి అమెరికా వెళ్లాలనుకున్న సంజయ్ ప్రయత్నాలను బాబు నిలువరించారు.
ఇంటలిజెన్స్ చీఫ్ పీఎస్సాఆర్ సీతారామాంజనేలు ఈయన బాబును కర్నూలులో అరెస్ట్ వ్యక్తి, కొల్లి రఘురామిరెడ్డి తదితర నాయకులు గత ఐదేళ్లలో బాబును తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఇక ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తామని కలిసేందుకు ప్రయత్నించిన గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డిని కూడా బాబు దూరం పెట్టారు. వీరంతా రెడ్ బుక్ లో అధికారులని భావిస్తున్నారు.
వారికి ఐదేళ్లు గడ్డు కాలమేనా ?..
వైసీపీ హాయాంలో టీడీపీ నేతలు గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారు. అధినేత చంద్రబాబు నాయుడు కూడా 50 రోజులకుపైగా జైలులో ఉండాల్సి వచ్చింది. బెయిల్ సమయంలో హైకోర్టు కనీస సాక్ష్యాలు లేవని స్పష్టం చేసింది. స్కిల్ కేసుతో సహా అన్నీ తప్పుడు కేసులేనని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టిన అధికారులను వదిలేది లేదని బాబు స్పష్టం చేశారు. సీఐడీ చీఫ్ గా ఇద్దరు పని చేశారు. అందులో ఒకరు పీవీ సునీల్ కుమార్, మరొకరు సంజయ్. వీరిపై ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ విరుచుకుపడుతూ వస్తోంది. రిషాంత్ రెడ్డి, జాషువా వంటి ఎస్పీలతో సహా అనేక మందిపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది.
ఆ అధికారులు కీలకం !..
జగన్ సీఎం అయిన తర్వాత డిప్యూటేషన్ పై ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన అధికారులు ఇక్కడ కీలక పదవుల్లో కొనసాగుతూ టీడీపీని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు వారు రిలీవ్ కోరుకుంటున్నారు. వారిని రిలీవ్ చేసేది లేదని ప్రభుత్వం నిర్ణయించింది. వీరిలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రామకృష్ణ మార్గదర్శిపై తప్పుడు కేసులు పెట్టిన వారిలో ప్రధాన వ్యక్తి. ఆయన వెళ్లిపోతానంటూ లెటర్ పట్టుకొని వెయిట్ చేస్తున్నారు. గనుల శాఖ ఎండీ వీజీ వెంకట్ రెడ్డి కూడా లెటర్ తో సిద్ధంగా ఉన్నారు.
సాక్షితో పాటు వైసీపీ ప్రచారానికి ప్రజాధనం దోచి పెట్టిన సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి, మద్యం స్కామ్ నడిపించిన ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి ఇలా కొంత మంది తమ శాఖలకు వెళ్లిపోతామని లెటర్లు పట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఏపీఎఫ్ఎస్ఎల్ ఎండీ మధుసూధన్ రెడ్డి, పరిశ్రమల శాఖ కమిషనర్ రాజేశ్వర్ రెడ్డి కూడా ఇదే చెబుతున్నారు. తెలంగాణకు వెళ్లేందుకు దరఖాస్తులు చేసుకున్న ఆర్ధికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ కు కూడా గ్రీన్ సిగ్నల్ రాలేదు.
తెలంగాణకు వెళ్లేందుకు మరికొందరు కీలక శాఖల అధికారులూ దరఖాస్తు పెట్టుకున్నారు. ప్రభుత్వం ఎవరినీ కదలనీయకుండా చేస్తోంది. సెలవుపై వెళ్తానంటూ దరఖాస్తు చేసుకున్న టీటీడీ ఈఓ ధర్మారెడ్డి సెలవులను క్యాన్సిల్ చేసింది. ఇలాంటి అధికారులకు సెటిల్ చేయాల్సిన లెక్కలు చాలా ఉన్నాయని టీడీపీ నేతలంటున్నారు.
చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత చాలా మంది అధికారులను జైలుకు పంపడంతో సహా రెడ్ బుక్ పేర్లన్నీ బయటపెట్టి బుద్ధి చెప్తారని టీడీపీ నేతలు అంటున్నారు.