![Satya Kumar Yadav](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-8-2.jpg)
Satya Kumar Yadav : ఏపీ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని 5వ బ్లాక్ లోని తన ఛాంబర్ లో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, వైసీపీ ప్రభుత్వంలో అన్ని రంగాలు వెనుకబడ్డాయని అన్నారు. కూటమి పాలనలో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను వెలికితీస్తామని తెలిపారు. ప్రతి ఆస్పత్రిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసి.. కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా అభివృద్ధి చేస్తామని, పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలయికలో ఏపీ అన్నివిధాలా అభివృద్ధి చెందడం ఖాయం మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
ఎన్డీయే ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టిందని చెప్పారు. 18 సంవత్సరాల లోపు వారి ఆరోగ్యం కోసం రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఫైలుపై మొదటి సంతకం చేసినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అత్యధిక మరణాలు క్యాన్సర్ వల్ల జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా స్క్రీనింగ్ టెస్టులు ఏర్పాటు చేసేందుకు రెండవ సంతకం చేసినట్లు చెప్పారు.