Nara Brahmani : మహిళలను ఆదుకునేందుకే సూపర్-6 పథకాలు అని నారా బ్రాహ్మణి అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా యర్రబాలెం సంధ్య స్పైసెస్ కంపెనీని సందర్శించి అక్కడ ఉన్న కూలీలతో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రజల కోసం టిడిపి అధినేత చంద్రబాబు ఉత్సాహంతో పనిచేస్తారని, ఆ విషయంలో ఆయనకు ఎవరూ సాటిరారని అన్నారు.
మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన కోసం చంద్రబాబు పరితపిస్తారని, ప్రస్తుతం డ్వాక్రా సంఘాల్లో కోటి మంది మహిళలు సభ్యులుగా ఉన్నారంటే అందుకు చంద్రబాబే కారణమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదట మహిళా స్పీకర్ గా ప్రతిభా భారతికి అవకాశం ఇచ్చింది ఆయనే అని పేర్కొన్నారు. పేద ప్రజలను ఆదుకునేందుకు సూపర్-6 పథకాలను ప్రకటించారని బ్రాహ్మణి తెలిపారు.
గతంలో అన్న క్యాంటీన్ ద్వారా రూ.5లకే పేదల ఆకలి తీరేదని, జగన్ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను ఎత్తేశారని, రోడ్లన్నీ అధ్వానంగా మారాయని, గత ఐదేళ్లుగా నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, ఇంటిల్లిపాది పనిచేసినా ఇల్లు గడవడం కష్టంగా మారిందని మహిళలు బ్రాహ్మణి ఎదుట వాపోయారు. దీంతో ఆమె స్పందిస్తూ కూటమి అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లను పునరుద్ధరిస్తామని, లోకేశ్ ను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు.