America : భారత ఉపఖండంలో క్రికెట్ ఉన్న క్రేజ్ మరే ఆటకు లేదు. అన్నింటికంటే చవకగా ఆడుకునే ఆట కావడంతో చిన్న పిల్లల నుంచి పెద్దల దాక క్రికెట్ అంటే మక్కువ చూపుతుంటారు. ఓ చెక్క బ్యాట్, రబ్బర్ బాల్, మూడు కర్రలు ఉంటే చాలు క్రికెట్ ఆడుకోవచ్చు. ఇంతటి సౌలభ్యం ఉండడంతో భారత ఉపఖండంలో ఏ గల్లీ చూసినా క్రికెట్ ఆడుతున్న వారే కనిపిస్తారు. అందుకే భారత్ లో క్రికెట్ ఎంతో ఆరాధన. క్రికెట్ ను చూడడంలోనూ, ఆడడంలోనూ, క్రికెటర్లను ఆరాధించడంలోనూ భారతీయులదే ముందంజ.
నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రికెట్ ను బతికిస్తున్నది భారతే అని చెప్పాలి. ప్రపంచంలో క్రికెట్ ను ఆడేది కేవలం ఓ ఇరువై దేశాలు మాత్రమే. అందులో ఓ 14 వరకు మాత్రమే అంతర్జాతీయ టోర్నీలు ఆడుతుంటాయి. ఇక భారత క్రికెట్ బోర్డు అన్ని దేశాల్లో కెల్ల సంపన్నమైంది. క్రికెట్ ను చూసే వారు భారత్ లో కోట్లలో ఉండడంతోనే క్రికెట్ ఆట మనగడ సాధిస్తోంది. ఇక అమెరికాలాంటి దేశాల్లో కూడా క్రికెట్ కు ఆదరణ పెంచాలని అక్కడ స్థిరపడిన భారతీయులు ప్రయత్నిస్తున్నారు.
వాస్తవానికి అమెరికాలో క్రికెట్ ఆటకు ఇప్పుడిప్పుడే ఆదరణ దక్కుతోంది. దీనికి కారణం భారత ఉప ఖండం నుంచి అక్కడికెళ్లిన వారు ఆడడమే. అందులో ముఖ్యంగా భారతీయులు క్రికెట్ ను అమెరికాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. సెలవు దినాల్లో అక్కడున్న భారతీయులు క్రికెట్ ఆడుతుంటారు. అలాగే టోర్నమెంట్లు కూడా పెట్టుకుంటారు.
తాజాగా ప్రముఖ తెలుగు టీవీ చానల్ స్వరాజ్య టీవీ ఆధ్వర్యంలో టీ-20 క్రికెట్ మ్యాచ్ ను న్యూజెర్సీలో నిర్వహించారు. టీమ్ 1983, బ్రూక్లిన్ నైట్స్ అనే రెండు టీమ్ ల మధ్య మ్యాచ్ జరిగింది. విశాల మైదానంలో జరిగిన మ్యాచ్ లో క్రికెటర్లు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.