Marriage : వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక శుభ సమయం. ఇరు కుటుంబాల ఆశీస్సులతో, మేళాతాళలతో బంధువుల ఆనందోత్సాహాలతో జరిగే ఈ తంతు చాలామందికి ఒక తీపి జ్ఞాపకం.. అయితే ఇలాంటి సమయంలోనే కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. పెళ్ళికొడుకు చేతుల్లోంచి తాళిని లాక్కొని హుండీలో వేసేందుకు ప్రయత్నించింది పెళ్లికూతురు. ఒక్కసారిగా అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.
తమిళనాడులోని రామనాథపురం లో ఈ ఘటన జరిగింది. రామనాథపురం జిల్లా తిరువడినై గ్రామంలో స్థానిక యువకుడు ఒకరు విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. అతని పక్క గ్రామానికి చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. సోమవారం ఉదయం తిరుమల గ్రామంలో ఉన్న ఆలయంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం వధూవరులు వివాహ రిజిస్టర్లు సంతకాలు కూడా చేశారు. పూలమాలలు మార్చుకున్నారు.
అయితే వరుడు వధువు మెడలో తాళికట్టబోతున్న సమయంలో ఒక్కసారిగా ఆమె తాళి లాక్కొని తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. తాళిని వెంటనే హుండీలో వేసేందుకు ప్రయత్నించింది. అయితే బంధువులు సమాధానం పరచడానికి ఎంత ప్రయత్నించినా ఆమె వినిపించుకోలేదు. దీంతో వరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు రంగంలోకి విచారణ చేపట్టారు. అయితే తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని తల్లిదండ్రుల బలవంతం మేరకే ఒప్పుకున్నట్లు చెప్పింది. మరోవైపు వరుడు ఇంట్లో వివాహ విందు కార్యక్రమం కొనసాగింది. అక్కడ పెళ్లి ఆగిన విషయం తెలువక వచ్చిన బంధువులు చదివింపులు కూడా జరిపించేశారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత వారంతా అవాక్కయ్యారు. గ్రామంలో ప్రస్తుతం ఈ వివాహం ఆగిన విషయం పెద్ద చర్చగా మారింది. సోషల్ మీడియోలో ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.