Bypoll Results 2023 :
దేశవ్యాప్తంగా ఈ వారం లో జరిగిన ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ షురూ అయ్యింది. ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్, యూపీలోని ఘోసి, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్ లోని ధూప్ గురి, జార్ఖండ్ లోని డుమ్రీ త్రిపురలోని బోక్సానగర్, ధన్ పూర్, స్థానాల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.
అయితే ఇప్పుడు ఈ ఫలితాలు ప్రతిపక్షాల ఇండియా కూటమికి సవాల్ గా మారాయి. ఘెసి, డుమ్రీలలో ప్రత్యర్థి పార్టీలు కొత్తగా ఏర్పడిన కూటమి ఇండియాలో భాగంగా ఉమ్మడి అ భ్యర్థిని నిలబెట్టాయి. ఈ ఏడాది చివరలో ఐదు రాష్ర్టాల ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ ఫలితాలు ఇటు ఎన్టీఏకు, అటు ఇండియాకు బలాబలాల పరీక్షగా మారింది.
ప్రస్తుతం ఏడు స్థానాల్లో మూడు బీజేపీ కాగా, ఎస్పీ, సీపీఐ, జేఎఎం, కాంగ్రెస్ చేతిలో ఒక్కొక్కటి ఉన్నాయి. ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ ఉప ఎన్నికల కోసం 130 మంది పోలింగ్ సిబ్బందితో 14 టేబుళ్లలో లెక్కింపు జరుగుతుందని జిల్లా మేజిస్ర్టేట్ అనురాధ పాల్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి చందన్ రామ్ దాస్ మరణంతో బాగేశ్వర్ స్థానం ఖాళీ అయ్యింది. 2007 నుంచి ఇప్పటి వరకు ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మరోవైపు త్రిపురల ఓ నియోజకవర్గంలో కౌంటింగ్ ను బహిష్కరిస్తున్నట్లు సీపీఐ(ఎం) ప్రకటించింది. అక్కడ రెండు సెంటర్ల రిగ్గింగ్ జరుగుతున్నట్లుగా ఆరోపించింది.
ఇక మిగతా అన్ని రాష్ర్టాల్లోని ఉప ఎన్నికల కౌంటింగ్ నిష్పక్షపాతంగా జరుగుతున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆయా చోట్ల సాయుధ బలగాలను మోహరించారు. అనుమతి ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతినిస్తున్నారు. ఏదేమైనా ఇటు అధికార ఎన్డీఏ కూటమి, అటు ప్రతిపక్షాల ఇండియా కూటమి ఈ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి.