![West Godavari District](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/06/P-5-2.jpg)
West Godavari District : నెలల వయసున్న ఓ చిన్నారి బ్యాటరీ మింగడంతో సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో వైద్యులు తొలగించారు. దీంతో ఆ చిన్నారికి ప్రమాదం తప్పింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల పాప ఆడుకుంటూ శనివారం మధ్యాహ్నం పొరపాటున బొమ్మలోని చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు చిన్నారిని పరీక్షించి విజయవాడకు తీసుకువెళ్లాలని సూచించడంతో అంబులెన్స్ లో చిన్నారిని హుటాహుటిన తరలించారు.
విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రి వైద్యులు చిన్నారికి ఎక్స్ రే తీసి చూడగా, బ్యాటరీ కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ కనిపించింది. శస్త్ర చికిత్స అవసరం లేకుండానే ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని జాగ్రత్తగా బయటకు తీశారు. ఘటన జరిగిన వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమై చిన్నారిని ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చిన్నారికి ఎలాంటి ప్రమాదం లేదనీ, కొన్ని గంటలు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి ఇంటికి పంపించినట్లు తెలిపారు. ఆయుష్ ఆసుపత్రి వైద్యులు శ్రీహర్ష, ఎం.ఎస్.గోపాలకృష్ణ బృందం ఆధ్వర్యంలో విజయవంతంగా బ్యాటరీని తొలగించారు.