![Bhatti Vikramarka](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/P-13-10.jpg)
Deputy CM Bhatti Vikramarka : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రూ. లక్ష రుణమాఫీ చేస్తామన్న బీఆర్ఎస్ ఐదేళ్లు కాలయాపన చేసి మిమ్మల్ని రుణమాఫీ ఎప్పుడు చేస్తారని అడగడం విడ్డూరంగా ఉందన్నారు. హైదరాబాద్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నేరవేర్చడానికి సిద్ధంగా ఉందన్నారు. రైతు భరోసా మొత్తంతో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఉన్నాం. ప్రజలు కట్టిన పన్నులు ఎక్కడా వృథాగా పోకూడదనే ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నామని తెలిపారు.
రైతు భరోసాపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీలో ఎవరి సొంత నిర్ణయాలు ఉండవు. అన్ని జిల్లాల్లో ప్రజలతో చర్చించిన తర్వాత నివేదిక తయారు చేస్తామన్నారు. దానిపై అసెంబ్లీలో చర్చ పెట్టిన తర్వాత విధివిధానాల ఖరారు ఉంటుందని తెలిపారు. రైతులు, పన్ను చెల్లింపుదారులు, మీడియా మిత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.