Ex CM Jagan : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికంటే ముందే అక్రమాస్తుల కేసులు నమోదయినాయి. కేసులు నమోదు కావడంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కొద్ది నెలలపాటు జైలు జీవితం కూడా గడిపారు. జైలు నుంచి వచ్చాక తెలుగు దేశం పరిపాలనపై ఒంటరి పోరాటం చేశారు. ఐదేళ్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించారు. ఐదేళ్ల కాలంలో ఎంతో కొంత రాజకీయంగా మద్దతు దొరికింది. ఆ మద్దతు తోనే అయన కోర్టుకు హాజరు కాకుండా ప్రశాంత వాతావరణంలో కొనసాగారు.
ఐదేళ్ల తరువాత జగన్ మోహన్ రెడ్డి అధికారం కోల్పోయారు. జగన్ ను ప్రతిపక్ష పాత్రకే ఏపీ ప్రజలు పరిమితం చేశారు. గడిచిన ఐదేళ్ల కాలంలో రాజకీయంగా దొరికిన మద్దతు ఇప్పుడు కంటికి కూడా కనబడే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి ఒంటరి నాయకుడు అయ్యాడనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి. ఆయనపై నమోదయిన అక్రమాస్తుల కేసులు ఇప్పుడు ఆయన కళ్ళముందర కనబడుతున్నాయి.
తాజా మాజీ సీఎం జగన్ పై సుమారుగా పదకొండు సీబీఐ కేసులు నమోదయి ఉన్నాయి. వాటికి తోడుగా మరో తొమ్మిది ఈడీ కేసులు కూడా జత కలిశాయి. ఈ ఇరువై కేసులు ఇప్పడు ఆయనను వెంటాడే పరిస్థితి కనబడుతుంది. ఇన్ని రోజులు ముఖ్యమంత్రి భాద్యతలను కోర్ట్ కు చూపిస్తూ హాజరు కాకుండా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదనేది ఆయనకు తెలుసు.
ఇప్పుడు అయన కేవలం సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. కాబట్టి కేసుల విచారణ కోసం కోర్టుకు ఆయన సహకరించాల్సిందే. ఇప్పుడు సీబీఐ, ఈడీ క్రమం తప్పకుండ కేసులను విచారించడానికి సిద్ధమవుతోందని సమాచారం. జగన్ ను కోర్ట్ కు పిలుస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినబడుతోంది. ఒకవేళ అదే నిజమైతే హైద్రాబాద్ లోనే ఆయన ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి శుక్రవారం అయన క్రమం తప్పకుండ హాజరై వివరణ ఇచ్చుకోవాల్సిందే.