Viral Photo : హైదరాబాద్ నగరంలో వర్షం కురిస్తే రహదారుల దుస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. రోడ్లు చెరువులు, సముద్రాలను తలపిస్తాయి. ఎక్కడ ఏ గుంత ఉంటుందో తెలియక పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. అయినా చాలా మంది ఆ రోడ్ల గుండానే ప్రయాణిస్తారు. పాలకులను విమర్శిస్తూ.. ముందుకు సాగుతారు తప్ప ఎలాంటి చర్యలకు దిగరు. కానీ ఈ మహిళ అందరిలా కాదు. మనకెందుకులే అని అనుకోకుండా.. ఒంటరి పోరుకు సిద్ధమైంది.
హైదరాబాద్ లోని నాగోల్ ఆనంద్ నగర్ లో రోడ్లు పాడైపోయినా ఎవరూ పట్టించుకోవట్లేదని ఓ మహిళ రోడ్డుపై వినూత్న నిరసనకు దిగింది. నడిరోడ్డుపై బురదలో కూర్చొని నిరసన తెలిపింది. పాడైపోయిన రోడ్లతో నరకం అనుభవిస్తున్నామని తక్షణమే రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరింది. అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరలవుతోంది. మహిళ ఒంటరి పోరును నెటిజన్లు అభినందిస్తున్నారు. ప్రజలు చేయాల్సింది ఇలాంటి నిరసనలేనని, నాయకుల కోసం కొట్టుకోవడం కాదని పేర్కొంటున్నారు.