![NTR Bhavan](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/ntr-bhavan.webp)
NTR Bhavan attack Case : మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబర్ 19న పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేశారు. టీడీపీ కార్యాలయ సిబ్బందిపై దాడి చేయడంతో పాటు.. పార్టీ ఆఫీసు ఆవరణలో ఉన్న కార్లు ధ్వంసం చేశారు. ఈ వ్యవహారంపై దాదాపు రెండున్నరేళ్ల తర్వాత పోలీసులు విచారణ మొదలుపెట్టారు. వైసీపీకి చెందిన కీలక నేతలతో పాటు పలువురిపై టీడీపీ నేతలు దాడి గురించి అప్పట్లో ఫిర్యాదు చేశారు.
ఈ ఘటనపై నమోదు కేసులపై పోలీసులు తాజాగా విచారణ ప్రారంభించారు. టీడీపీ ఆఫీసుకు వెళ్లి సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. దాడి చేసిన వారితో పాటు ఈ దాడి వెనుక ఎవరున్నారన్నది తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వైసీపీ నేతలు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి అనుచరులు టీడీపీ ఆఫీసుపై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీలు విచారణ వేగవంతం అయింది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రస్తుతం రాష్ట్రంలో లెక్కలు మారుతున్నాయి. గతంలో జరిగిన దాడులపై నమోదైన కేసులను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. దాదాపు రెండున్నరేళ్ల క్రితం జరిగి మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి ఘటనపై పోలీసులు దృష్టి పెట్టారు. సోమవారం టీడీపీ ఆఫీసుకు వచ్చిన పోలీసులు…దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు.
కొంత సీసీ ఫుటేజీని పోలీసులు తమతో తీసుకెళ్లారు. ఈ వ్యవహారంలో పలువురిని అరెస్టు చేయొచ్చని తెలుస్తోంది. ఇప్పటికే ఈ దాడిలో కీలకంగా వ్యవహరించిన వారిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ముందుగా దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసే ఛాన్స్ ఉంది. అనంతరం దాడి చేయించిన వారిపై పోలీసులు దృష్టిపెట్టనున్నారు.
టీడీపీ నేత పట్టాభి సీతారామ్…అప్పటి ముఖ్యమంత్రి జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తలు మంగళగిరి టీడీపీ ఆఫీసుపైకి దాడికి దండెత్తారు. ఈ ఘటనలో 2021 అక్టోబర్ 19న టీడీపీ ఆఫీసులోని అద్దాలు, ఫర్నీచర్ సహా వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ ఆఫీసులోని సిబ్బంది, నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడికి దిగారు.. అప్పట్లో కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ ఆఫీసుతో పాటు టీడీపీ నేత పట్టాభి సీతారామ్ ఇంటిపై కూడా వైసీపీ శ్రేణులు దాడి చేశారు. పట్టాభి ఇంట్లోని విలువైన వస్తువులు ధ్వంసం చేసి వీరంగం సృష్టించారు.