1983 Mahanadu : తెలుగోడి తెగువను ప్రపంచానికి చాటారు అన్న ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే చరిత్రాత్మక విజయం సాధించిన నేపథ్యంలో 1983- మహానాడును విజయవాడలో నిర్వహించాలని ఎన్టీ రామారావు తలచారు. 1983 మే 27,28 తేదీల్లో నిర్వహించే మహానాడు సమావేశానికి ప్రతిపక్షాల ఐక్యత పెంపొందించే దిశగా ప్రతిపక్ష నాయకులను ఆహ్వానించాలని ఎన్టీఆర్ నిర్ణయించారు. ప్రముఖులందరినీ ఆహ్వానించడానికి ఉపేంద్ర ఢిల్లీ వెళ్లారు.
కమ్యూనిస్టు పార్టీలు మొదలు భారతీయ జనతా పార్టీ వరకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 23 మంది నాయకులు ఆహ్వానానికి స్పందించారు. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ కూడా సమావేశానికి హాజరయ్యారు. వారంతా విజయవాడ కొండ మీద ఉన్న థర్మల్ పవర్ స్టేషన్ గెస్టుహౌస్ లో సమాన హెూదాలో అనేక విషయాలపై విస్తృతంగా చర్చలు జరిపారు.
కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధాంతపరంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ వ్యతిరేకం. ఆయన కారణంగా ఇందిరాగాంధీ తీరును కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసించే ముసాయిదా సంయుక్త ప్రకటన వెలుగు చూడలేదు. అయితే ప్రతిపక్షపార్టీలు కలసి పనిచేయాల్సిన అవసరాన్ని మాత్రం ఆ సమావేశం నొక్కి చెప్పింది.
ఆ రోజు సాయంత్రం విజయవాడలో జరిగిన బహిరంగసభ దేశ రాజకీయాల్లోనే అద్భుతం. భారీ వర్షాన్ని కూడా లెక్కచేయక దాదాపు అయిదు లక్షల మంది జనం ఆ చరిత్రాత్మక సభకు హాజరయ్యారు. 23 రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఒకే వేదిక మీద కనిపించడం అంతకు ముందు దేశం చూడలేదు. బీజేపీ నాయకులు ఒక పక్క కమ్యూనిస్టు నాయకులు మరో పక్క, ఇతర పార్టీల నాయకులు మధ్యలో చేతులు కలిపి నిలబడడం, కాంగ్రెస్ వ్యతిరేక వ్యూహాన్ని చర్చించడం అనేది ఆ రోజుల్లో ఎవరూ ఊహించని విషయం. ఆ రకంగా అదొక అద్భుతం.
నాటి మహానాడుకు హాజరైన వారిలో ఎల్.కె. అద్వానీ (BJP),బర్నాలా (అకాలీదళ్),తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ (AIADMK), కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే (జనతా), జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), రవీంద్ర వర్మ (జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి), ఎ.ఎస్. మిశ్రా (లోక్ దళ్), శరద్ పవార్ (కాంగ్రెస్ [ఎస్), హెచ్.ఎన్. బహుగుణ (డెమోక్రటిక్ సోషలిస్ట్ పార్టీ), మేనకా గాంధీ (రాష్ట్రీయ విచార్ మంచ్), జగ్జీవన్ రామ్ (కాంగ్రెస్ [జె]), మాకినేని బసవపున్నయ్య (సీపీఐ [ఎం), చంద్ర రాజేశ్వరరావు (సీపీఐ)..ఇలా ఎంతో మంది హేమాహేమీలు హాజరు కావడం విశేషం.