CM Revanth Reddy : కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా అయ్యింది. ఇటీవల రేషన్ కార్డుల విషయంలో కొన్ని సూచనలు చేసింది. ప్రస్తుతం ఉన్న కార్డులను రద్దు చేసి కొత్తవి ఇవ్వాలని భావిస్తోంది. డిసెంబర్ 28 నుంచి జారీ చేసే కార్డుల విషయంలో నిబంధనలు విధించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సరైనదా? ఈ నిర్ణయంతో సీఎం ఇబ్బంది ఎదుర్కొంటారా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల 80 లక్షల కార్డులున్నాయి. ఈ మొత్తం రద్దు చేసి మళ్లీ కొత్తవి ఇస్తే కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
రేషన్ కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తలోనే ప్రజల నుంచి నిరసన ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఒకే.. కొత్తవి మంజూరు చేయాలంటే మొత్తానికి ప్రక్షాళన చేస్తేనే సాధ్యమయ్యేలా తెలుస్తోంది. అయితే కొత్త నిబంధనల ప్రకారం.. 100 గజాల కంటే ఎక్కువ స్థలంలో ఇల్లు లేదా ఫ్లాట్ ఉన్నవారికి రేషన్ కార్డుకు అనర్హులుగా ప్రకటిస్తారని పుకార్లు వస్తున్నాయి. ఇది గనుక ప్రభుత్వం అమలు చేస్తే రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న చాలా మంది వారి అర్హతను కోల్పోతారు. రాజకీయంగా ఇది దుమారం రేపే అవకాశం ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే 6 గ్యారంటీలకు అర్హులుగా ఉండాలంటే రేషన్ కార్డును ప్రామాణికంగా చూపే అవకాశం లేకపోలేదు. దీన్ని పరిశీలిస్తే ఆ సంఖ్య భారీగా తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నవాళ్లు తమ కార్డులను కోల్పోతే ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తారు. ఆశిస్తున్న వారికి కార్డు రాకుంటే వారు కూడా వ్యతిరేకతను వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న కార్డులను అలాగే ఉంచి, కొత్త వాటిని మంజూరు చేస్తే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న గ్యారంటీలు అమలు కష్టంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
ప్రభుత్వంపై ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో సీఎం ఏం చేస్తారు? ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారు? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.