TTD : తిరుమలలో శ్రీవారికి నివేదించే అన్నప్రసాదాలకు సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. అదేవిధంగా అన్నప్రసాదాల దిట్టం కూడా పెంచాలని టీటీడీ నిర్ణయించిందని ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ ప్రచారంపై టీటీడీ స్పందించింది. అందులో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది.
ఇటీవల అర్చకులు, ఆలయ అధికారులతో ఈవో శ్యామలరావు నిర్వహించిన సమావేశంలో స్వామివారికి నివేదించే అన్నప్రసాదాలు, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారని తెలిపింది. అయితే, దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. కానీ, అన్నప్రసాదాల తయారీలో మార్పులు చేసినట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని భక్తులకు టీటీడీ సూచించింది.