KCR Arrogance : ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ అనుభవిస్తున్న అన్ని కష్టాలకు.. కేసీఆర్ కుటుంబానికి మనశ్శాంతి లేకుండా పోవడానికి ఆయన అహంకార పూరితంగా తీసుకున్న అనాలోచిత నిర్ణయాలే కారణమని ఆ పార్టీ నాయకుల్లో అసంతృప్తి రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రస్తుత ఈ పరిస్థితికి అసలు కారణం బీఎల్ సంతోష్ ను అరెస్టు చేయాలన్న కేసీఆర్ నిర్ణయమేనన్న వాదన వినిపిస్తోంది. బీఎల్ సంతోష్ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక విమానంలో పోలీసులను పంపిన విషయం వెలుగులోకి రావడంతో ఆయనను టార్గెట్ చేయడం వల్లే బీజేపీ ఇదంతా చేసిందన్న అభిప్రాయానికి నేతలు వస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు ఎవరెన్ని కారణాలు చెప్పినా అసలు కారణం మాత్రం ప్రధానంగా బీజేపీనే. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీ మంచి జోరు మీదుంది. ఎప్పుడైతే బండి సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి అధిష్టానం తప్పించిందో తర్వాత ఆ పార్టీ రేసులో వెనుకబడిపోయింది. దీంతో కాంగ్రెస్ పార్టీ రేసులో ముందుకు వచ్చింది. బీజేపీ ముందే చేతులెత్తేయడానికి కారణం.. కాంగ్రెస్ గెల్చినా పర్వాలేదు కానీ మళ్లీ బీఆర్ఎస్ గెలవకూడదన్న కారణంతోనే అంటున్నారు. బీజేపీ బండి సంజయ్ నేతృత్వంలో బలంగా పోరాడి ఉన్నట్లయితే.. కనీసం హంగ్ అయినా వచ్చేదని.. లేకపోతే ఎన్నికల్లో పోలైన ఓట్లు చీలి కేసీఆర్ మూడో సారి గెలిచేవారన్న వాదన కూడా వినిపిస్తోంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసి బీజేపీ ఆలోచనతో బీఆర్ఎస్ ను ఓడించింది.
ఈ క్రమంలోనే అదను చూసి కేసీఆర్ బిడ్డ కవితను జైలుకు పంపారు. ఇక ప్రస్తుతం కవితకు ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియని పరిస్థితి. కవిత లిక్కర్ స్కాం ఆరోపణలు రావడం.. ఢిల్లీ జైలులో ఉండటాన్ని బీఆర్ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో గొప్పగా ఫలితాలు సాధించే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ద్వారానే బీఆర్ఎస్ ను నిర్వీర్యం చేసేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నించింది.
తనను టార్గెట్ చేశారని తెలిసిన తర్వాత హైదరాబాద్ వచ్చిన బీఎల్ సంతోష్.. ఖచ్చితంగా అనుభవించాల్సిందేనని కేసీఆర్ కు వార్నింగ్ ఇచ్చారట. దానికి తగ్గట్లే ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నారని బీజేపీ వర్గాలంటున్నాయి. ఢిల్లీ బీజేపీలో మోడీ, అమిత్ షా తర్వాత అధ్యక్షుడిగా నడ్డా ఉన్నా సరే.. బీఎల్ సంతోష్ పవర్ ఫుల్. తమ జోలికి వస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో కేసీఆర్ కు ప్రత్యక్షంగా చూపుతున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ అసలు వేడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీఎల్ సంతోష్ జోలికి వెళ్లాలనుకోవడమే.. అహంకార పూరిత నిర్ణయమని అదే కేసీఆర్ పతనాన్ని శాసిస్తోదని బీజేపీ నేతలు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు.