AP News : ఏపీలోని భీమవరానికి చెందిన యువతి మిస్సింగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తొమ్మిది నెలల క్రితం అదృశ్యమైన యువతి కేసులో డిప్యూటీ సీఎం పవన్ చొరవ చూపించగా దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. ఇన్స్టా చాట్ ఆధారంగా ఆ జంటను జమ్ములో గుర్తించి రాష్ట్రానికి తీసుకుని వచ్చారు. జమ్ము నుంచి విజయవాడకు తీసుకొచ్చిన పోలీసులు ఆ యువతిని క్షేమంగా తన తల్లిదండ్రులకు అప్పగించారు. విజయవాడ రామవరప్పాడుకు చెందిన అంజద్ను మాచవరం పీఎస్కు తరలించారు. ఈ క్రమంలో బాధితురాలి నుంచి సమాచారం తెలుసుకున్నారు. నెల రోజులుగా సరిగా తిండి పెట్టలేదని, తొమ్మిది నెలలుగా చిత్రహింసలకు గురిచేస్తూ ఐదు రాష్ట్రాలు తిప్పినట్లు బాధితురాలు తెలిపింది. తనను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి బలవంతాన తీసుకెళ్లాడని పోలీసులకు చెప్పింది. దీంతో అతడిపై కేసు నమోదు చేశారు. పోలీసులు వారి నుంచి స్టేట్మెంట్లను తీసుకున్నారు.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను విజయవాడ నుంచి గతేడాది అక్టోబరు 28న అంజాద్ బలవంతంగా తీసుకుని వెళ్లాడని తేజస్విని చెప్పింది. తొమ్మిది నెలల్లో ఎక్కడా తనను ఇతరులతో ఫోన్లో మాట్లాడనీయలేదని, తాము చాలా ప్రాంతాలు తిరిగి.. చివరకు జమ్మూలో దిగినట్లు స్టేట్మెంట్లో యువతి చెప్పుకొచ్చింది. అక్టోబర్ 28న రాత్రి హైదరాబాద్కు వచ్చిన జంట.. హైదరాబాద్లోని ఓ హోటల్లో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అక్కడికి పోలీసులు చేరుకునేసరికి తప్పించుకున్నారని, ఆ తర్వాత ఓ షాపులో 18వేలకు ఇద్దరి ఫోన్లు అమ్మి కేరళకు వెళ్లినట్లు వెల్లడించారు. కొద్ది రోజులకు కేరళ నుంచి మళ్లీ హైదరాబాద్ వచ్చిన జంట.. రూ.15వేలకు చెవిదిద్దులు అమ్మి రాజస్థాన్, ముంబై, పుణే, ఢిల్లీల మీదుగా తిరుగుతూ ప్రయాణం కొనసాగించినట్లు పోలీసులు తెలిపారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ జమ్ముకు వెళ్లారు. కొన్నాళ్లకు చేతిలో డబ్బులు లేక కష్టాలుపడ్డారు. దీంతో అంజాద్ ఓ హోటల్లో పనికి చేరాడు. అయితే వీరిద్దరూ ఫోన్లు అమ్మడంతోపాటు కొత్త నంబర్లు తెలియకపోవడంతో కేసు కష్టంగా మారినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలతో కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన అధికారులు.. IMEI నంబర్ల ఆధారంగా ఫోన్లు అమ్మిన షాపుకు వెళ్లి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఫ్రెండ్స్, కుటుంబసభ్యుల ఫోన్లపై నిఘా పెట్టారు. అయినప్పటికీ ఎలాంటి సమాచారం వారికి లభించలేదు. దీంతో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి కేసు ఛేదించారు. ఇటీవల అతని ఫోన్ నుంచి అక్కకు ఇన్స్టాగ్రామ్లో తేజస్విని మెసేజ్ చేసిందని, ఇన్స్టా చాట్ ద్వారా వివరాలు రాబట్టే ప్రయత్నంలో వారు ఎక్కడున్నది ఆమె చెప్పలేకపోవడంతో లొకేషన్ పంపించిందని పోలీసులు చెప్పారు. అది కూడా ఫెయిలవడంతో ఓ ఫొటో ప్రేమ్ పార్శిల్ బాక్స్పై అడ్రస్తో జమ్ములో ఉన్నట్టు గుర్తించి పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక తొమ్మిది నెలల క్రితం తమ కుమార్తె కనిపించడం లేదని పవన్ కల్యాణ్ కు తల్లి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా అప్పటికప్పుడే సీఐతో ఫోన్ లో మాట్లాడిన పవన్ వెంటనే కేసునే ఛేదించాలని ఆదేశించడంతో స్పెషల్ టీమ్ రంగంలోకి దిగి పట్టకున్నారు. జమ్మూలో తనను ఓ గదిలో ఉంచాడని, అక్కడ తనకు భాష రాకపోవడంతో ఎక్కడికీ వెళ్లలేకపోయినట్లు చెప్పింది. అక్రమంగా బంధించడం, పెళ్లి చేసుకుంటానని బలవంతాన తీసుకెళ్లడం, దాడి చేయడం, బంధించడం వంటి నేరాలపై బీఎన్ఎస్లోని 342, 366, 323 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యువతిని పోలీసులు తల్లికి అప్పగించారు.