Change in Jagan : ఇటీవల ఏపీ అసెంబ్లీ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అందరిలో ఒక ప్రశ్న మెదిలింది. అదేంటంటే? జగన్ వస్తారా? రారా? అని. కానీ ఎవరూ ఊహించనట్లు ఆయన వచ్చారు.. వెళ్లారు.. కానీ ఆయన తీరులో ఆత్మన్యూనతాభావం ఉన్నట్లు కనిపించింది. అలవా ఉన్ననప్పుడు ఆయన ఏదైనా విషయం చెప్పాలనుకుంటే తడబడతారని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. జగన్ తీరు కూడా అలానే ఉంది.
జగన్ అసెంబ్లీలోకి ప్రవేశించడమే వెనక గేటు నుంచి వచ్చారు. ఎందుకంటే.. వచ్చే దారిలో.. అమరావతి రైతులు తనపై దాడి చేస్తారని ఆయన అలా వచ్చారనే వాదన వినిపిస్తోంది. సరే వచ్చారు కదా.. అనుకుంటే.. హుందాగా సభలోకి రావాల్సిన ఆయన.. తన ప్రమాణ స్వీకారం కోసం పేరు పిలిచిన సమయంలోనే వచ్చారు. వచ్చి ఐదు నిమిషాలు చివరి బెంచ్లో కూర్చొని ప్రమాణ స్వీకారం చేశాక.. అసెంబ్లీలో ఉండకుండా.. తన ఛాంబర్కు వెళ్లిపోయారు. ఇక అటునుంచి అటు ఇంటికి వెళ్లారు. అప్పుడు కూడా వెనక గేటు నుంచే వెళ్లారు. ఇలా నిన్న జగన్.. అడుగడుగునా.. ఏమాత్రం కాన్ఫిడెన్స్ లేని వ్యక్తిలా వ్యవహరించారనే టాక్.
జగన్ ఓడిపోయినా వైసీపీకి 40 శాతం ఓటు షేర్ ఉంది. కాబట్టి ఓట్లు వేసిన వారికి ప్రతినిధిగా జగన్ సభలోకి ధైర్యంగా రావాలి, కాన్ఫిడెన్స్తో ఉండాలి. ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉండాలి. ప్రస్తుత ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన పథకాలపై నిలదీయాలి. ప్రతిపక్షంలో ఉంటూ ప్రజలకు మద్దతుగా వ్యవహరించాలి. తను కూడా ఒక ప్రజా ప్రతినిధని మరువద్దు, గంభీరంగా ఉండాలి. తనకు ఓటు వేసే వారి పక్షాన అసెంబ్లీలో తాను ఉన్నానని జగన్ ధైర్యంగా నిలబడాలి. అది మాని తనకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించడం సబబు కాదనే వాదన వినిపిస్తోంది.
ఇవాళ (జూన్ 22) కూడా వైసీపీ.. అసెంబ్లీకి వెళ్లద్దని నిర్ణయించుకుంది. మరి ఆ పార్టీకి ఓట్లేసిన వారి సంగతేంటి? వారి తరఫున అసెంబ్లీలో ఎవరు ఉండాలి? ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి కదా. కాడి వదిలి సేద్యం చేస్తానంటే ఎలా? ఇదే ప్రశ్న ప్రజల నుంచి వినిపిస్తోంది. ఫలితాలు వచ్చినప్పటి నుంచి జగన్ అదోలా వ్యవహరిస్తున్నారని, తనకు ఓట్లు ఎందుకు వేయలేదో అని ప్రజలను తప్పుపుడుతున్నారని వాదనలు వినిపిస్తున్నాయి. ఓట్లు వేసిన వారికి భరోసాగా ఉండాల్సిన ఆయన.. అసెంబ్లీకి వెళ్లద్దనే తీరు.. సరైనది కాదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.