![CM Revanth](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/revanth2-1.jpg)
CM Revanth : డ్రగ్స్ కేసులో ఎంత పెద్ద సెలబెట్రీలు ఉన్నా విడిచిపెట్టొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే డ్రగ్స్ కు సంబంధించిన నిరోధక బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. శనివారం ఆయన హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ లోని ఉన్నతాధికారులు, సీఎస్ శాంతికుమారి, విద్యుత్, ఇతర శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యంగా డ్రగ్స్ కట్టడి, గంజాయి సరఫరా చేసే వారిపై తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి, డ్రగ్స్ లాంటి సరఫరా ఉండకూడదని హెచ్చరించారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యల కంటే ఎక్కువ పటిష్ఠంగా పని చేయాలని పోలీసులకు సూచించారు. అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘాతో పాటు రాష్ట్ర సరిహద్దుల్లో భద్రత చర్యలు పెంచాలని కోరారు. డ్రగ్స్ సరఫరా వ్యవస్థను దెబ్బతీయాలని అధికారులకు ఆదేశించారు. ఈ డ్రగ్స్ వ్యవస్థను విచ్చిన్నం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
తెలంగాణలోని యాంటీ నార్కోటిక్ బ్యూరో అనేది వేరే రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచేలా పని చేయాలని సూచించారు. ఈ మధ్య బెంగళూరులోని రేవ్ పార్టీకి సంబంధించి తెలుగు సినిమా నటీ నటులు ఇద్దరు ఉన్నారని సమాచారంతో రాష్ట్రంలోని పోలీసు ఉన్నతాధికారులు హైదరాబాద్ పై దృష్టి సారించారు. సిటీకి ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు. ఎవరూ చేస్తున్నారనే వివరాలను ఇప్పటికే సేకరించి పెట్టుకున్నారు.
గతంలో తెలుగు సినీ నటీ నటులు చాలా మంది డ్రగ్స్ వినియోగించినట్లు అనేక మంది పేర్లు బయటకు వచ్చాయి. ఈ సారి బెంగళూరు పోలీసులు ఏకంగా తెలుగు నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు బెంగళూరు పోలీసులు పేరు బయట పెట్టడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో కలకలం రేపింది. అయితే టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది డ్రగ్స్ కు బానిసయ్యారనే వార్తలు వినిపించాయి. గంజాయి తీసుకుంటుండగా.. షణ్ముక్ జశ్వంత్ పట్టుబడగా.. తాజాగా నటి హేమ పట్టుబడడంతో తెలుగు యాక్టర్లపై అనుమానాలు పెరిగిపోయాయి.