Pawan Political Mark : జనసేనాని పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ర్టా్ల్లోనూ పోటీకి సై అంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీకి సిద్ధమయ్యారు. పలు నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ఆయన ప్రకటించారు. తాజాగా హైదరాబాద్ లో నిర్వహించిన బీజేపీ సభలో ఆయన ప్రధాని మోదీతో పాటు వేదిక పంచుకున్నారు.
ఇక ఏపీలో గత 2019 ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఈసారి ఒక లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో జనసేన ఒక్క సీటు మాత్రమే గెలువగా, ఆ ఎమ్మెల్యే కూడా ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లారు. ఇక 2024లో వచ్చే ప్రభుత్వంలో తమ పార్టీ కూడా ప్రాతినిథ్యం వహించేలా పావులు కదుపుతున్నారు. చంద్రబాబు లాంటి సీనియర్ రాష్ర్టానికి అవసరమంటూ పొత్తుకు చేతి కలిపారు. ఈ క్రమంలో భవిష్యత్ లో తనకు రూట్ క్లియర్ చేసుకుంటున్నట్లు కనిపిస్తున్నది.
రాష్ర్టంలో వైసీపీ పునాదులు కదిలేలా ఆయన పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన వారాహి యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన ప్రభుత్వం ఖాయమని ఆయన స్పష్టంగా చెబుతున్నారు. అయితే బీజేపీని కూడా కలిసిరావాలని ఆయన కోరుతున్నారు. దీనిపై ఇప్పటివరకు ఆ పార్టీ అధిష్టానం ఎలాంటి ప్రకటన చేయకున్నా, పవన్ మాటను ఒప్పుకునే చాన్స్ ఉంది.
ఇక ఇటు తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్ల్లోకి వెళ్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అటు సినిమాలు చేసుకుంటూనే ఇటు రాజకీయాల్లో తనదైన పాత్ర పోషిస్తున్నారు. రాజకీయాల్లో తనదైన మార్క్ చూపాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో పోటీ నుంచి టీడీపీ, వైఎస్సార్టీపీ తప్పుకున్నా, జనసేన మాత్రం పోటీలో ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో ఎందరో అమరవీరుల త్యాగఫలితమే తెలంగాణ అంటూ ఆయన మంగళవారం ప్రసంగించారు. ఇక తెలంగాణ లో బీజేపీ, జనసేన ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. అయితే పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపేలా జనసేనాని ప్రకటనలు చేస్తు్న్నారు. పార్టీ రెండు చోట్ల పోటీలో ఉంటుందని, అయితే పొత్తులతో కొంత సర్దుకుపోవాల్సి ఉంటుందని స్పష్టంగా చెబుతున్నారు. ఇక తనను నమ్ముకున్నవారికి మాత్రం ఏదో ఒక పదవిలో ఉంచాలని మాత్రం ఆయన భావిస్తున్నారు.