![YS Jagan](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/07/P-16-10.jpg)
YS Jagan : వైసీపీ హయాంలో గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం చుట్టూ సామాన్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు విధించి ఇబ్బందులకు గురిచేశారు. ప్రస్తుతం ఆ దారిలో రాకపోకలు పునరుద్ధరించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ మార్గంలోని అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నారు.
తాజాగా, సోమవారం రాత్రి జగన్ నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రహదారిలో రాకపోకలు మరింత సుగమమయ్యేలా చర్యలు చేపట్టారు. వాహనాలను నిలిపివేయకుండా వెళ్తే కట్టడి చేసే టైర్ కిల్లర్లు, హైడ్రాలిక్ బుల్లెట్లను క్రేన్ సాయంతో తీసివేశారు. ఇవన్నీ విద్యుత్ తో పనిచేస్తాయి. వీటితో పాటు రోడ్డుపై వేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్లు, ఆంధ్ర రత్న పంపింగ్ స్కీం వైపున ఉన్న పోలీసు చెక్ పోస్టును సైతం ఎత్తివేశారు. తొలగించిన సామగ్రిని లారీలో తరలించారు. అడ్డంకులు తొలగి రహదారి తిరిగి అందుబాటులోకి వస్తుండడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.