Revanth Reddy : తొలి, మలిదశ ఉద్యమాల్లో వందల మంది బలిదానాలు.. మరెంతో మంది ఆశ, ఇంకెందరో ఆకాంక్షలతో స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే నేతలు వారి ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. స్వరాష్ట్రంలో మొదటి సారి గద్దెనెక్కిన కేసీఆర్ ఉద్యమం మొదలు తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర అధికారిక ముద్రం ఇలా అన్నింటిలో తన మార్కే స్పష్టంగా కనిపించాలని పరితపించాడు. దీనిపై ప్రశ్నించిన వారి నోరును మూయించాడు కేసీఆర్.
ఆయన హయాం ముగిసి రేవంత్ రాగానే.. రాష్ట్రంపై కేసీఆర్ ముద్రను చెరిపేసేందుకు అన్నింట్లో మార్పులు చేస్తున్నారు. అనుకున్నదే తడువుగా వేగంగా పావులు కదుపుతున్నారు. తెలంగాణ తల్లిగా కేసీఆర్ గుర్తించిన ప్రతిమతో పాటు అధికారిక చిహ్నంలో రేవంత్ ప్రభుత్వం మార్పులు, చేర్పులను సిద్ధమైంది. ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సంప్రదాయాలను స్ఫూరించేలా లేదని దొరసానిలా ఉందంటూ గతంలో రేవంత్ వ్యాఖ్యానించారు. తెలంగాణ తల్లికి మరో విగ్రహాన్ని తయారు చేయిస్తున్న రేవంత్ ఇటీవలే తుది రూపును ఖరారు చేశారు. రాష్ట్ర అధికారిక చిహ్నం విషయంలోనూ చిత్రకారుడు రుద్ర రాజేశ్తో చర్చలు జరిపిన రేవంత్.. చిహ్నంలో కాకతీయుల కోటను తీసివేయాలని కోరింది.
ఇక తెలంగాణ రాష్ట్ర గీతంగా ‘అందెశ్రీ’ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ను కీరవాణితో రికార్డింగ్ చేయించారు. ఇప్పటికే తెలంగాణలోని వాహనాలు రిజిస్ట్రేషన్ కోడ్, ప్రభుత్వ సంస్థలపై టీఎస్ ను తొలగించి టీజీకి మార్పించారు. తెలంగాణ జాతిపితగా బీఆర్ఎస్ కేసీఆర్ ను కీర్తిస్తుండడంతో కౌంటర్ గా ‘జయశంకర్’ పేరును తెరపైకి తెచ్చారు.
ఇలా రాష్ట్రం ఏర్పడి దశాబ్దం పూర్తయిన సందర్భంగా తెలంగాణ బ్రాండ్ ను సరికొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. వ్యూహాత్మకంగానే రేవంత్ ఇవన్నీ చేస్తున్నట్లు తెలుస్తోంది.