![Threatening calls](https://jaiswaraajya.tv/wp-content/uploads/2023/06/Be-alert-for-calls.jpg)
Threatening Calls to Canada : కెనడాలో భారతీయ కమ్యూనిటీ ఎక్కువగానే ఉంటుంది. అయితే ఆ కమ్యూనిటీలో ఉంటున్న ప్రవాస భారతీయులకు కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దుండగులు భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇది ఆందోళన చెందాల్సిన విషయం అని పేర్కొంది.
‘కెనడాలోని పౌరులకు.. అందులో మరీ ఎక్కువగా భారత కమ్యూనిటీకి చెందిన వారికే బెదిరింపు కాల్స్ రావడం ఆందోళన చెందాల్సిన విషయం. ఈ నేపథ్యంలో భారత్, కెనడా దౌత్యవేత్తలు చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. గతంలో ఒక హిందూ ఆలయంపై దాడి జరిగింది. ఆ సమయంలో దాడిపై విచారణ జరిపిన కెనడా పోలీసులు మతిస్థిమితం లేని వ్యక్తి పని అంటూ ప్రకటన విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఈ తరహా ఘటనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి’ అని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ తెలిపారు.
ఈ బెదిరింపు కాల్స్ విషయంపై ఆ దేశ అధికారులు టాస్క్ ఫోర్స్ ను నియమించారు. ముఖ్యంగా ఇండో-కెనడియన్ కమ్యూనిటీ నిర్వహిస్తోన్న వ్యాపార సంస్థలకు ఈ కాల్స్ ఎక్కువగా వస్తున్నట్లు సమాచారం. ఈ తరహా 9 ఘటనలపై దర్యాప్తు జరుగుతోంది.
గతేడాది జూన్లో కెనడాలోని సర్రే ప్రాంతంలో ఖలిస్తానీ ఉగ్రవాది నిజ్జర్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో రెండు దేశాల మధ్య దౌత్య వివాదం రాజుకుంది. ట్రూడో వ్యాఖ్యలను భారత్ ఇప్పటి వరకు ఖండిస్తూనే వస్తుంది. ఈ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని.. వాటిని పరిశీలించిన తర్వాతే స్పందిస్తామని భారత్ ఇప్పటికే పలుమార్లు కెనడాకు స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే.. నిజ్జర్ హత్య కేసులో ఇద్దరు అనుమానితులను కెనడా పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.