World Champions : టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత క్రికెట్ జట్టు భారత్ కు తిరిగి వచ్చింది. జూలై 4న బార్బడోస్ నుంచి టీమ్ ఇండియా ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. దీని తర్వాత బృందం నేరుగా తమ హోటల్ ఐటీసీ మౌర్యకు వెళ్లింది. టీమిండియా ప్లేయర్లు అక్కడ జోరుగా డ్యాన్స్ చేశారు, ఆ తర్వాత టీమ్ ఇండియా ప్రధాని మోదీని కలవడానికి బయలుదేరింది. అయితే, రోహిత్ సేన మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరుతుంది. ఆ తర్వాత సాయంత్రం ముంబైలో టీమ్ రోడ్ షో నిర్వహిస్తోంది. టీమ్ అంతా ఓపెన్ టాప్ బస్సులో యాత్ర చేయనున్నారు. దీంతో అభిమానులు తమ ప్లేయర్లను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. టీమిండియా పరేడ్ కు బస్సు కూడా సిద్ధంగా ఉంది.
టీమిండియా పరేడ్ కు ప్రత్యేక బస్సు
ముంబైకి చెందిన వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. సాయంత్రం భారత జట్టు పరేడ్ చేయనున్న బస్సు వీడియో సోషల్ మీడియా షేర్ అవుతున్నది. ఆ బస్సుకు తుది మెరుగులు దిద్దుతున్నారు. బస్సును పూర్తిగా భారత జట్టు ట్రోఫీని ఎత్తుకున్న ఫోటోలతో నింపేశారు. బస్సులో భారత ప్రపంచకప్ జట్టు మొత్తం కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ సెక్రటరీ జే షా తదితరుల ఫొటో బస్సులో ఉంది.
టీమిండియా విజయ యాత్రకు అన్ని ఏర్పాట్లు చేశామని ముంబై క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అజింక్యా నాయక్ తెలిపారు. ముంబై పోలీసులు, బీసీసీఐ మార్గదర్శకత్వంలో, ముందుగా వచ్చిన వారికి ఉచిత ప్రవేశం కల్పిస్తామని చెప్పారు. బుధవారం ముంబై పోలీసులతో సమావేశమయ్యామని చెప్పారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించనున్నట్లు చెప్పారు. ఇది ముంబై క్రికెట్ అసోసియేషన్ తో పాటు దేశానికి గర్వకారణమై రోజు అని, భారత జట్టును స్వాగతిస్తున్నందుకు తాము చాలా సంతోషిస్తున్నామని చెప్పారు.