![Kidnap](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/05/P-4-17.jpg)
Kidnap : విదేశాల్లో ఉన్న మీ పిల్లలను కిడ్నాప్ చేశాం. అడిగినంత డబ్బు ముట్టచెప్పండి. లేకుంటే వారు మీకు మిగలరు. అని బెదిరిస్తూ సైబర్ మోసగాళ్లు సరికొత్త పంథాలో ప్రజలను దోచుకుంటున్నారు. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి ఫోన్ కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తమ పిల్లలకు నేరుగా ఫోన్ చేయడం, వారు చదువుతున్న విద్యాసంస్థల ద్వారా వారి సమాచారాన్ని తెలుసుకుని అగంతకుల మోసాలను తిప్పికొట్టాలని సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.
అమెరికాలోని క్లీవ్ ల్యాండ్ లో మహ్మద్ అబ్దుల్ అర్భాత్ అనే భారతీయ విద్యార్థిని మార్చి 7న కిడ్నాప్ చేశారు. పది రోజుల తర్వాత ఆయన్ను విడుదల చేయడానికి 1200 అమెరికన్ డాలర్లు డిమాండ్ ఫోన్ ద్వారా చేశారు. ఆ తర్వాత ఆ యువకుడు వారి చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ ఏడాది ప్రారంభంలో విదేశాల్లో ఇద్దరు భారతీయ విద్యార్థుల విషయంలోనూ ఈ తరహా రెండు ఘటనలు జరిగాయి.
ఆ తరహా కాల్స్ వస్తే వెంటనే డయల్ 100, 1930కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. తల్లిదండ్రులు తమ పిల్లలను, విద్యాసంస్థల అధికారులను సంప్రదించాలి. విచారణ ప్రక్రియలో సహాయం అందించేందుకు కేటుగాళ్ల కాల్ ను రికార్డ్ చేయాలని సైబర్ క్రైం పోలీసులు సూచిస్తున్నారు.