RBI : వడ్డీ రేట్లపై ఆర్బీఐ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పరపతి విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగుతోంది. ఎంఎస్ఎఫ్, బ్యాంక్ రేట్ 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నట్లు ఆర్బీఐ ప్రకటించింది.
మరోవైపు సర్దుబాటు విధాన వైఖరి ఉపసంహరణను కొనసాగించాలని పరపతి కమిటీ నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ద్రవ్యోల్బణ తీరుతెన్నులపై నిశిత, నిరంతర నిఘా కచ్చితంగా అవసరమన్నారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించే అవకాశం ఉందన్నారు. విదేశీ మారక నిల్వలు 595.1 బిలియన్ డాలర్లు ఖజానాలో ఉన్నాయని పేర్కొన్నారు.