Bhagwat Karad : ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని (అన్ క్లియిమ్) డిపాజిట్లు రూ.42,270 కోట్లు ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ రాజ్యసభలో తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరంలో డిపాజిట్ల విలువ 28 శాతం పెరిగిందని పేర్కొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని మొత్తాలు రూ.32,934 కోట్లు ఉంటే, 2023 మార్చి నాటికి ఈ మొత్తం రూ. 42,272 కోట్లకి చేరిందని వివరించారు. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రూ.36,185 కోట్లు, ప్రైవేటు బ్యాంకుల్లో రూ.6,087 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు.
భారతీయ రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు పదేళ్లు, అంతకుమించి నిర్వహణలో లేని డిపాజిట్లను ‘ఆర్బీఐ డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్’ (DEA)కు బ్యాంకులు చేస్తాయని ఆయన తెలిపారు. బ్యాంకుల్లోని ఇలాంటి డిపాజిట్లను ఖాతాదారులకు అందించేందుకు ఆర్బీఐ ఒక వెబ్పోర్టల్ ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ‘అన్ క్లెయిమ్డ్ డిపాజిట్స్ గేట్వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్’ (UDGAM) పేరుతో నిర్వహిస్తున్న ఈ వెబ్పోర్టల్లో దేశంలోని వివిధ బ్యాంకుల్లో ఉన్న అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల సమాచారం తెలుసుకోవచ్చని మంత్రి స్పష్టం చేశారు.
‘100 రోజులు-100 చెల్లింపులు’ ద్వారా ఆర్బీఐ.. 1 జూన్, 2023 నుంచి 8 సెప్టెంబర్. 2023 వరకు దేశంలోని ప్రతీ జిల్లాలో ఉన్న బ్యాంకుల్లో 100 అన్ క్లెయిమ్డ్ డిపాజిట్లను గుర్తించి సెటిల్ చేసిందని మంత్రి తెలిపారు. దేశంలోని 31 ప్రధాన బ్యాంకులు రూ.1,432.68 కోట్లు ఖాతాదారులకు తిరిగి చెల్లించినట్లు వెల్లడించారు.