AP Debts : ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో రికార్డు నెలకొల్పేలా కనిపిస్తోంది. 2024లో ప్రవేశించిన రెండో రోజు రూ. 3వేల కోట్ల అప్పులను సమీకరించుకుంది. ఎనిమిదేళ్ల కాలపరిమితితో తిరిగి చెల్లించేలా 7.74 శాతం వడ్డీతో రూ.1000 కోట్లు, 12 ఏళ్ల కాలపరిమితితో 7.74 శాతం వడ్డీకి మరో రూ.1000 కోట్లు రుణంగా తీసుకుంది. ఇంకో రూ.1000 కోట్లను 19 ఏళ్ల కాలపరిమితితో 7.70 శాతం వడ్డీగా సమకూర్చుకుంది. ఆ నిధులు రాష్ట్ర ఖజానాకు బుధవారం జమయ్యే అవకాశం ఉంది. మరో వైపు ఉద్యోగుల జీతాలు, పింఛన్ల చెల్లింపునకు ఆపసోపాలు తప్పట్లేదు. c. ఇంకా 3 నెలలు గడిస్తే గానీ కేంద్రం నుంచి వివిధ రూపాల్లో రుణ అనుమతులు తీసుకునేందుకు అవకాశం కలుగుతుంది. 2024 ఎన్నికల సంవత్సరం వీలైనంత మందిని తృప్తి పరచాలనే తాపత్రయంతో అప్పులు చేసి గట్టెక్కాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తుంది.
ఎనిమిది నెలల్లో రూ.65,660 కోట్ల అప్పు
ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం తొలి 8 నెలల్లోనే అంచనాలకు మించి అప్పు తెచ్చుకోనుంది. బడ్జెట్ ప్రతిపాదనల్లో ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రూ. 54,587.53 కోట్ల రుణం తీసుకుంటామని చెప్తుంది. కానీ, నవంబరు ఆఖరు వరకే రూ. 65,660 కోట్ల రుణం తీసుకున్నట్లు కాగ్కు తెలిపింది. అంచనాలకు మించి 20 శాతం అప్పటికే తీసుకున్నారు. చివరి 3 నెలల్లో మరిన్ని రుణ అనుమతుల కోసం ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ వద్ద ప్రయత్నాలు చేస్తోంది. విద్యుత్ సంస్కరణలు, సీపీఎస్ అమలు రూపంలో అదనపు రుణ సౌలభ్యం పొందుతున్నారు.
కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలపై స్పష్టత లేదని కాగ్ తన నివేదికల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే వివిధ కార్పొరేషన్ల పేరుతో రూ.25 వేల కోట్లకు పైగా రుణాలు తీసుకున్నారు. అన్ని రుణాలు కలిపి రూ.లక్ష కోట్లు దాటేలా కనిపిస్తుంది. ఆర్థిక సంవత్సరం చివరి 3 నెలల్లో తీసుకున్న అప్పులతో రికార్డులు బద్ధలయ్యేలా ఉంది. నవంబర్ నెలాఖరు వరకు పన్నుల రూపేణా రాబడి మొత్తం రూ.79 వేల కోట్లు ఉంటే చేసిన అప్పుల మొత్తం రూ.65 వేల కోట్లు ఉందని కాగ్ పేర్కొంది. ఇందులో కార్పొరేషన్ల రుణాలు కూడా చేరిస్తే పన్నుల వసూళ్ల కన్నా అప్పుల మొత్తమే ఎక్కువవుతుంది.
మరో రూ.18 వేల కోట్ల కావాల్సిందే..
ఎన్నికలకు ముందు వీలైనంత ఎక్కువగా అప్పు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 3 నెలల్లో రూ.18 వేల కోట్లు కావాలని రిజర్వు బ్యాంకుకు వర్తమానం పంపించింది. జనవరిలోనే రూ.9 వేల కోట్లు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. తొలి 9 నెలలకు కేంద్రం ఇచ్చిన రుణ పరిమితుల మేరకు అప్పుపుట్టించిన ప్రభుత్వం.. అదనపు అనుమతుల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. తొలి ప్రయత్నాల్లో రూ.5 వేల కోట్ల వరకు అప్పులకు రాష్ట్రానికి కేంద్రం అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. మంగళవారం రూ.3 వేల కోట్ల సమీకరణ పూర్తయింది. ఫిబ్రవరిలో రూ.5 వేల కోట్లు, మార్చిలో రూ.4 వేల కోట్లు అప్పు కావాలని రిజర్వు బ్యాంకును రాష్ట్రం కోరుతోంది.