Crime News : జీతం వచ్చిన రోజే డబ్బులడిగాడనే ఆగ్రహంతో కన్న కుమారుడిని తుపాకీతో ఓ తండ్రి కాల్చి చంపేశాడు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్ లోని ఈవీఎం గోదాములో శనివారం జరిగింది.
త్రిపురాంతకం గ్రామానికి చెందిన కె.ప్రసాద్ అనే వ్యక్తి ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారులు ఆయనకు ఈవీఎంలు భద్రపరిచే గోదాము వద్ద కాపలా పనులు కేటాయించారు. అందులో భాగంగా రాత్రి పది గంటల సమయంలో కుమారుడు శశికుమార్ (22)తో కలసి ద్విచక్ర వాహనంపై గోదాము వద్దకు వచ్చారు. నిబంధనల ప్రకారం సదరు గోదాములోకి విధుల నిర్వహణలో ఉన్న సిబ్బంది తప్ప ఇతరులెవరూ ప్రవేశించకూడదు. అయినప్పటికీ ప్రసాద్ తన వెంట కుమారుడిని తీసుకెళ్లారు.
ఒకటో తేదీ కావడంతో వేతనం డబ్బులు తనకు ఇవ్వాలని శశికుమార్ తండ్రిని అడిగాడు. దీంతో ప్రసాద్ ఒక్కసారిగా విచక్షణ కోల్పోయారు. తీవ్ర ఆగ్రహంతో తన వద్ద ఉన్న తుపాకీతో కుమారుడి ఛాతీపై ఒక రౌండ్ కాల్పులు జరిపాడు. బుల్లెట్ గాయాలతో శశికుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది అక్కడికి చేరుకుని ప్రసాద్ ను అడ్డుకున్నారు.